
కోల్కతా : ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ దాదాపు 19 ఏళ్ల తర్వాత శుక్రవారం కోల్కతాకు చేరుకున్నారు. గతంలో వివాదాలు, నిరసనల నేపథ్యంలో నగరాన్ని వీడిన ఆమె, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం కోల్కతాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
“ఇంటికి తిరిగొచ్చినట్లే అనిపిస్తోంది. కోల్కతా నాకు ఎంతో ఇష్టం. చాలా కాలం తర్వాత తిరిగి రావడం ప్రత్యేకమైన అనుభూతి” అని తస్లీమా మీడియాతో అన్నారు.
తాను స్వచ్ఛందంగా కోల్కతాను విడిచి వెళ్లలేదని, అప్పటి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెళ్లాల్సిన పరిస్థితి కల్పించిందని ఆమె పేర్కొన్నారు. “ఏదో ఒక రోజు తిరిగి వస్తాననే ఆశను ఎప్పుడూ కోల్పోలేదు. ప్రభుత్వాలు మారినా ఇక్కడికి రావడానికి అవకాశాలు మాత్రం పరిమితంగానే ఉన్నాయి” అని చెప్పారు.
తస్లీమా నస్రీన్ 2007లో కోల్కతాను వీడారు. ఆమె ఆత్మకథాత్మక రచన ద్విఖండితోపై చెలరేగిన నిరసనల నేపథ్యంలో నగరాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. అంతకుముందు బంగ్లాదేశ్లో కూడా ఆమె రచనలు మతపరమైన వివాదాలకు దారితీయడంతో దేశం విడిచి వెళ్లారు. అనంతరం కోల్కతాలో దాదాపు పదేళ్లపాటు నివసించారు. 2003లో అప్పటి వామపక్ష ప్రభుత్వ హయాంలో ద్విఖండితో పుస్తకాన్ని మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందనే కారణంతో నిషేధించారు.
తస్లీమా రాకను భారతీయ జనతా పార్టీ స్వాగతించగా, ఇతర రాజకీయ పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కోల్కతా పర్యటనలో భాగంగా శనివారం రవీంద్ర సదన్లో నిర్వహించే మత మౌఢ్యానికి వ్యతిరేక సాహిత్య కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. ప్రస్తుతం 63 ఏళ్ల తస్లీమా నస్రీన్ ఢిల్లీలో దీర్ఘకాలిక నివాస అనుమతితో నివసిస్తున్నారు.
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె కోల్కతాకు తిరిగి రావడం సాహిత్య, సామాజిక, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.




