ArticlesNews

భారతీయతకు పల్లె పిలుపు 2 వ భాగం

7views

ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఎలా ఆవిర్భవించింది. ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ 2015లో ఆవిర్భవించింది. ఆరఎసఎస్‌లో ఉన్న చాలా మంది పెద్దలు కలిసి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటంలో వారి వంతు కృషిగా ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. దీనిలో అనేక శాఖలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవిగా విద్య, వైద్యం, వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం, గోవుల పోషణ, పరిరక్షణ, గో ఆధారిత ఉత్పత్తులు ఉన్నాయి. గ్రామీణాభివృద్ధికి దోహదపడే ఒక యజ్ఞంగా ఈ ఫౌండేషన్‌ను పరిగణనలోకి తీసుకొని ఇందులోని అన్ని శాఖలు గ్రామ జీవనానికి ప్రాముఖ్యతను ఇస్తాయి. విద్య విషయానికి వస్తే భారతీయ కళలు, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించే విధంగా మా సాందీపని గురుకులం ఉంది. 2024లో ఈ గురుకులాన్ని స్థాపించాము. ఇందులో విద్యార్థులకు సర్వసాధారణమైన విద్యాబోధనతో పాటుగా 64 భారతీయ కళలను కూడా దశలవారీగా నేర్పించడం జరుగుతుంది. అలాగే ఇదే ప్రాంగణంలో ఏకలవ్య సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఒక కళాశాల ఇక్కడ ఏర్పాటైంది. ఈ కళాశాలలో విద్యార్థు లకు సహజ వ్యవసాయం (నేచురల్ ఫామింగ్) నేర్పిస్తాము. ఇక్కడ నేర్చుకోవడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో ఆసక్తి ఉన్న రైతులకు ఈ వ్యవసాయ విధానం పట్ల అవగాహనను విద్యార్థులు కలిగిస్తుంటారు. నిరామయ పేరిట గో ఆధారిత ఉత్పత్తులు కూడా ఇక్కడ తయారవుతుంటాయి. దీని కోసం  ఇదే చోట కపిల గోశాలను నిర్వహిస్తున్నాము. గోశాలలో గిర్, పుంగనూరు, ఒంగోలు, దేవుని అనే నాలుగు రకాల ఆవులు ఉన్నాయి. ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్‌కు రెండు ప్రాంగణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది జింగుర్తి ప్రాంగణం. ఇది అనంతగిరి జిల్లా, తాండూరు మండలంలో 104 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ 104 ఎకరాలలో కళాశాల, గురుకుýం, వ్యవసాయం, గోశాల, వైద్య సేవలు, తదితర కార్యకలాపాలు నడుస్తున్నాయి. అదే విధంగా మెదక్ జిల్లా, తునికి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్ర పేరిట రెండవ ప్రాంగణం ఉంది. భారత ప్రభుత్వ పథకం కింద కృషి విజ్ఞాన కేంద్రం నడుస్తున్నది. సినీ నిర్మాత డాక్టర్ రామానాయుడు కుటుంబం ఇచ్చిన భూమిలో దాని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అక్కడ కూడా వ్యవసాయానికి సంబంధించిన విభాగాలను ఏర్పాటు చేశాము.

దాదాపు ఈ పుష్కర కాలంలో, ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధికి ఫౌండేషన్ దోహదపడింది. ఈ కార్యకలాపాల్లో స్థానికుల భాగస్వామ్యం ఏ మేరకు ఉంది?

స్థానికుల భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడి గ్రామీణుల బాగోగుల కోసమే ఈ ఫౌండేషన్ ఏర్పాటైంది. అది నిర్దేశించుకున్న లక్ష్యాలలో ముఖ్యమైనది పట్టణాలు, నగరాలకు గ్రామీణుల వలసలను అరికట్టడం. గ్రామాలలో ఉన్నవారు నగరాలకు వెళ్లి వాచ్‌మెన్, డ్రైవర్ లాంటి ఉద్యోగాలు చేసే అవసరం లేకుండా, స్వగ్రామంలో ఉంటూ, గో ఆధారిత వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతమైన జీవనం సాగించవచ్చు అని నిరూపించడమే ఫౌండేషన్ ముఖ్యమైన ఉద్దేశ్యం. ఒక గ్రామీణుడు తన కాళ్ల మీద తాను స్వతహాగా నిలబడి, రైతుగా జీవించడానికి అవసరమైన ఆదాయాన్ని కల్పించ డానికి ఫౌండేషన్ కృషి చేస్తున్నది. వ్యవసాయం మీద తగినంత ఆదాయంరాని పక్షంలో గో ఆధారిత ఉత్పత్తులను తయారుచేయడంలో గ్రామీణులకు శిక్షణ ఇస్తుంది. వారి ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతుంది. వాటి అమ్మకాలతో అదనపు ఆదాయాన్ని అందిస్తున్నది. తద్వారా గ్రామీణ జీవనాన్ని ఆనందమయం చేస్తున్నది. ఇందుకోసమని చుట్టుపక్కల గ్రామాల్లో గ్రామవికాసం అనే కార్య క్రమాన్ని మేం నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా విద్యార్థి వికాస్ యోజన అనే కార్యక్రమం కూడా ఉంది. గతేడాది అనంతగిరి జిల్లాలో దీన్ని  ప్రారం భించాము. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా ట్యూషన్ తరగతులు నిర్వహిస్తున్నాము. అలా తరగతులు నిర్వహించడం పట్ల ఆసక్తి ఉన్న స్థానిక యువతీయువకులకు బోధనలో శిక్షణ ఇస్తున్నాము. విద్యార్థులకు భారతీయ సంస్కృతీ సంప్రదాయాల పట్ల అవగాహనను పెంచి, వారిలో వాటిని పాదుగొల్పడంతో పాటుగా వారిని యోగసాధకులుగా తయారుచేస్తున్నాము. నగరాలు, గ్రామాలలో మనం కోల్పోయిన  భారతీయ కళలను పునరుద్ధరించే పనిలో ఉన్నాము. ఆ క్రమంలో చుట్టుపక్కల గ్రామాలలో సాంస్కృతిక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇక్కడ ప్రధానంగా సామర్థ్య నిర్మాణ కార్యక్రమం (కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్) గురించి చెప్పుకోవాలి. ఈ కార్యక్రమంలో భాగంగా జింగుర్తి ప్రాంగణంలో నెలకు ఒకసారి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు, సర్పంచులకు సహజ వ్యవసాయంలో సాంకేతిక మెళకువలను నేర్పిస్తున్నాము. అలా నేర్చుకున్నవారు వారి వారి గ్రామాల్లో సుస్థిర సహజ వ్యవసాయానికి కారకులవుతున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం అనంతగిరి, మెదక్ జిల్లాలలో 100 గ్రామాలకు విస్తరించింది. తద్వారా సాగులో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడుతున్న అన్నదాతలను గో ఆధారిత వ్యవసాయం వైపునకు మళ్లించడంలో సఫలీకృతలమవుతున్నాము.


నేచురల్ ఫామింగ్(సహజ వ్యవసాయం), ఆర్గానిక్ ఫామింగ్(సేంద్రియ వ్యవసాయం)ల గురించి తరచుగా ప్రస్తావిస్తుంటారు. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి?

సేంద్రియ వ్యవసాయం.. ఆర్గానిక్ అని మనం ప్రత్యేకంగా చెప్పి చేయాల్సిన పనిలేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను పనిచేస్తున్న ఈ సంస్థ అభిప్రాయం కూడా అదే. ఆర్గానిక్ అని ఎలాఅంటారు మీరు? రసాయనాలు లేకుండా ఏదీ ఉండదు. మానవ శరీరం రసాయనాలతో నిర్మితమైనది. మనం చేస్తున్న వ్యవసాయంలో రసాయనాలు లేవని మీరు ఎలా చెప్పగలరు? సహజ (నేచురల్) పద్ధతిలో చేసే వ్యవసాయంలో కూడా రసాయనం ఉంటుంది. మనల్ని ఇబ్బంది పెట్టకుండా చేసే రసాయనాలతో చేసేదే సహజ వ్యవసాయం (నేచురల్ ఫామింగ్) అవుతుంది. అదే భారతీయత. ఇది ఇప్పటిదికాదు. అనాదిగా ఉంది. కాకపోతే మనం దానిని మర్చిపోయాం. అంతే. అందరూ ఇళ్లలోని ఆవులను ఎప్పుడో అమ్మేశారు. అదే ఆవులను ఆధారంగా చేసుకొని ఉత్పత్తులను తయారు చేయవచ్చు.  వానపాములతో ఎరువు (వర్మి కంపోస్ట్) చేయవచ్చు. చివరకు ఆవు పేడతో బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయవచ్చు. ఇన్ని విధాలుగా గోమాత మనకు సేవలు అందిస్తున్నది. అందుకు కృతజ్ఞతగా గోమాతకు మనం సేవ చేయాల్సిన అవసరం ఉంది.


సహజ వ్యవసాయానికి దేశీయ విత్తనాలను ఎలా సమకూర్చుకుంటున్నారు?

దేశవ్యాప్తంగా సహజ వ్యవసాయం సాగిస్తున్న అనేక మంది రైతులు రకరకాలైన దేశీయ విత్తనాలను ఎప్పటికప్పుడు భద్రపరుస్తున్నారు. అలాంటి రైతులతో మా ఫౌండేషన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ఉదాహరణకు మీరు మా బొప్పాయి తోటను చూశారు. దేశవ్యాప్తంగా ఫిలిప్పైన్స్, థాయ్‌ల్యాండ్ దేశాలకు చెందిన బొప్పాయి మాత్రమే అందుబాటులో ఉంది.  ఇక్కడ మాత్రం దేశీయ బొప్పాయి లభిస్తుంది. ఇదేదో లాభార్జన కోసం చేస్తున్న సాగుబడి కాదు. దేశంలో ఎక్కడ బొప్పాయిని రుచిచూసినప్పటికీ దాని రుచి గడ్డి తిన్నట్టుగా ఉంటుంది. మీరు మా బొప్పాయిని రుచి చూడండి. ఇక్కడ దొరికేది మన దేశపు బొప్పాయి. దీనికి సంబంధించిన విత్తనాలను మా నర్సరీలోనే అభివృద్ధి చేస్తాం. వాటిని భద్రపరుస్తాం. అదే విధంగా కృషి విజ్ఞాన కేంద్రలో వరికి సంబంధిం చిన దేశీయ వంగడాలను అభివృద్ధి చేయడం మొదలుపెట్టాం. కలిసివచ్చే రైతులను కలుపుకొని ముందుకు సాగడమే దీనికి శ్రేయదాయకంగా ఉంటుంది.

నీటి వనరుల లభ్యత ఎలా ఉంది?

నీటి వనరులకు సంబంధించి మేం భూగర్భ జలాల కన్నా కూడా వర్షాల మీదనే ఎక్కువగా ఆధార పడుతుంటాం. వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడంపైన దృష్టిని కేంద్రీకరిస్తుంటాం. ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్‌కు చెందిన జింగుర్తి ప్రాంగణంలో ఏడు చెరువులున్నాయి. ఇవి అంతర్గతంగా అనుసంధానమై ఉంటాయి. వర్షాలు పడినప్పుడు ఆయకట్టుకు సమీపంలో ఉండే చెరువులో నీరు చేరుతుంది. అది చుట్టపక్కల ఉన్న బోరుబావులలో భూగర్భ జలాల మట్టాన్ని పెంచుతుంది. మిగిలిన చెరువులలో నీటి మట్టం పెరిగేలా చూస్తుంది. అలా మా ప్రాంగణం అంతా నీటి తడుపునకు నోచుకుంటుంది. ఇప్పుడైతే ఎలాంటి వర్షాలు లేవు. అయినప్పటికీ మా చెరువులలో నీరు పుష్కలంగా ఉంది.

ఇక్కడ బిందుసేద్యం(డ్రిప్ ఇరిగేషన్) వినియోగానికి ప్రత్యేక కారణం ఉందా?

బిందుసేద్యం అనేది లక్ష్యాన్ని దృష్టిలో ఉంచు కుంటుంది. ఇది కొంత ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ నీటి వృథా ఉండదు. పంటకు ఎంత కావాలో అంతే తేమను అందిస్తుంది. దీనిని ఐదు నుంచి పదేళ్లుగా వాడుతున్న రైతులు ఉన్నారు. మేం ఐదేళ్లుగా బిందుసేద్యాన్ని ఆచరణలో పెడుతున్నాం. చివరకు వర్మికంపోస్ట్(వానపాములతో ఎరువు తయారీ)లో తేమను నిలకడగా ఉంచడానికి బిందుసేద్యాన్ని వాడుతున్నాం.

సాందీపని గురుకులంలో సనాతనం, ఆధునికతల మేళవింపును వివరిస్తారా?

భారతీయ విద్యావిధానాన్ని పరిపుష్టం చేసే దిశగా 2024లో ప్రారంభమైన సాందీపని గురుకులంలో ప్రవేశాలు నాల్గవ తరగతి నుంచి మాత్రమే ఉంటాయి.కేంద్ర ప్రభుత్వం పరిధిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎనఐఓఎస్)కు లోబడి గురుకులం పాఠ్య ప్రణాళిక ఉంటుంది. ఎన్ ఐఓఎస్ అందించే కోర్సులకు, సాందీపని గురుకులం ధ్యేయానికి ఎంతో సారూప్యం  ఉంది. ప్రస్తుతం కోర్సుల నుంచి భవిష్యత్తులో నైపుణ్యాల అభివృద్ధి, ఆంట్రో పెన్యూర్ (ఔత్సాహిక పారిశ్రామికవేత్త) కోర్సుల వరకు విద్యార్థులకు అందించాలని అనుకుంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే గురుకులంలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని బయటి ప్రపంచంలో అడుగుపెట్టే విద్యార్థులు 10 మందికి ఉద్యోగాలను అందించే వారిగా(జాబ్ గివర్స్) అవతరించాలే తప్ప ఉద్యోగాలను ఆశించేవారిగా(జాబ్ సీకర్స్) ఉండ కూడదనే దిశగా ఇక్కడి విద్యావిధానం పనిచేస్తుంది. అందుకనే గురుకులం విద్యార్థులు ఒకవైపు వేదాలను చదువుకుంటూనే మరోవైపు డ్రోన్లు ప్రయో గిస్తుంటారు. ఇక్కడ విద్యార్థులు తెల్లవారుజామున నాలుగన్నర గంటలకే నిద్ర లేస్తారు. వారి దినచర్య ఉదయం నాలుగున్నర గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం ఏడు గంటలకు యజ్ఞాలు చేస్తారు. దాంట్లో మీకు భారతీయత కనిపిస్తుంది. మధ్యాహ్నం కంప్యూటర్ ల్యాబ్‌లో కృత్రిమ మేధస్సు(ఏఐ)ను నేర్చుకుంటారు. ఏడవ తరగతి నుంచి కంప్యూటర్ ల్యాబ్‌తో పాటుగా జీవశాస్త్రం, రసాయన శాస్త్రాలకు సంబంధించిన ప్రయోగశాలలు గురుకులంలో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. కార్పోరేట్ సామాజిక బాధ్యత (సీఎసఆర్)లో భాగంగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ), జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎనఎండీసీ) వాటిని సమకూర్చాయి. ఈ ప్రయోగ శాలల్లో సాధారణ పాఠ్య ప్రణాళికతో పాటుగా అధునాతన నైపుణ్యాలను విద్యార్థులకు నేర్పిస్తున్నాం.

గురుకులంలో విద్యార్థులకు సామూహిక ఉపనయనం చేయిస్తారని విన్నాము. విద్యాభ్యాసంలో దానికి అంతటి ప్రాముఖ్యత ఉందా?

గురుకులం విద్యార్థులు 12 సంవత్సరాలపాటు బ్రహ్మచర్య దీక్ష చేపట్టాల్సి ఉంటుంది. మా గురు కులంలో చేరిన విద్యార్థులు బ్రహ్మచర్యాన్ని అవలం బిస్తారు కాబట్టి కులమతాలకు అతీతంగా కొత్తగా నాల్గవ తరగతిలో చేరిన విద్యార్థులతో గురుపూర్ణిమ నాడు సామÖహిక ఉపనయనం చేయిస్తాము. ఆ రోజున తల్లిదండ్రులు, గురువులు ఇలా అందరి ఆశీస్సులతో వారు ఆ దీక్షకు నాంది పలుకుతారు.   ఇక్కడ కులాలు, మతాల పట్టింపు ఉండదు. వాటిని గురించి పిల్లలను అడిగే ప్రసక్తి ఉండదు. కేవలం ప్రభుత్వానికి సమర్పించే రిజిస్టర్‌లో మాత్రమే పిల్లల కులం, మతం వివరాలు ఉంటాయి. గురుకులానికి సంబంధించిన రిజిస్టర్‌లో వాటి ఊసే ఉండదు. విద్యార్థులకు ఎలాంటి ఫీజులు ఉండవు. విద్యార్థుల ఆసక్తి ప్రధానంగా ఇక్కడ విద్యాబోధన ఉంటుంది.