ArticlesNews

భారతీయతకు పల్లె పిలుపు 1 వ భాగం

34views

గోధూళి ధూసరిత కోమల గోపవేషం

గోపాల బాలకశతైః అనుగమ్యమానం।

సాయన్తనే ప్రతి గృహం పశుబంధనార్థం

గచ్ఛన్తమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం ॥

(సమస్త గోవులు నడుచుట వలన లేచిన ధూళితో (గోధూళి) ధూసరితమైన (కప్పబడిన) కోమలమైన గోప వేషము కలిగినవాడూ, వందలాది గోప బాలురు తనను వెంట అనుసరించి నడుచుచుండగా, సాయంకాల సమయమున ఆవులను ఇళ్లలోని దొడ్లలో కట్టుటకు (లేదా మందకు తోలుకొనుచు) వెళుతున్న అచ్యుతుడైన (నాశనము లేని) ఆబాలగోపాలునికి ప్రతినిత్యము నమస్కరించుచున్నాను).

హైదరాబాద్‌కు 120 కి.మీ.ల దూరంలో, మారుమూల ప్రాంతంలో 104 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్. జాగృతి పత్రిక బృందంలో ఒకడిగా అక్కడి ప్రాంగణంలో పర్యటిస్తున్న సమయంలో దేశీయ గోవులు గుంపులు గుంపులుగా కనిపించినప్పుడు పై శ్లోకం గుర్తుకు వచ్చింది. దాదాపు పుష్కరకాల ప్రస్థానంలో గ్రామీణ వికాసం లోనూ, భారతీయతకు పట్టం కట్టడంలోనూ ఎన్నో విజయాలను సాధించింది ఫౌండేషన్. పల్లె ప్రగతి దిశగా మైలు రాళ్లను నెýకొల్పింది. ప్రాంగణం ఆరంభంలో ఆంజనేయస్వామి దేవాలయం మొదలుకొని ఏకలవ్య సేంద్రియ పాలిటెక్నిక్ కళాశాల, సభామందిరం, నిరామయ ఉత్పాదనల కేంద్రం, కపిల గోశాల, వ్యవసాయ క్షేత్రం, ఉద్యానవన పంటల మడులు, వర్షాభావ పరిస్థితుల్లోనూ నీటితో కళకళలాడుతున్న చెరువులు, చదువు చెప్పడంలోనూ, నేర్చుకోవడంలోనూ సనాతన భారతీయతను, ఆధునికతను మేళవించుకొని సత్ సంకల్పంతో కూడుకున్న సమాజ నిర్మాణం దిశగా విద్యార్థులతో ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న సాందీపని గురుకులం వరకు ఫౌండేషన్ ధ్యేయనిష్ఠకు, అనిర్వచనీయమైన కృషికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అనాదిగా మన దేశానికి వెన్నెముకగా వ్యవసాయం నిలుస్తున్నది. గడచిన కొద్ది దశాబ్దాల కాలంలో ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థికవిధానాలు, ప్రైవేటీకరణ కారణంగా ఉపాధికి మూలాలుగా పట్టణాలు, నగరాలు వెలిశాయి. దీనికి తోడు పాశ్చాత్య జీవనశైలి పట్ల భారతీయులు వ్యామోహం పెంచుకున్నారు. కట్టూ బొట్టూ మారిపోయింది. వస్త్రధారణ వింతపోకడలు పోయింది. పాశ్చాత్యులను అనుకరించే క్రమంలో , పాంటూ, చొక్కా నలగని ఉపాధి అవకాశాల కోసమని పల్లె ప్రజలు పట్టణాలు, నగరాల బాట పట్టారు. బోసిపోయిన పల్లె బావురుమంది. కాయకష్టం చేసుకుంటూ నేలతల్లిని తరతరాలుగా నమ్మకుంటూ వస్తున్న అన్నదాతలకు సరైన ప్రోత్సాహం లేకుండా పోయింది. ఇదే కాకుండా ప్రకృతి కన్నెర్ర చేసిన కారణంగా వర్షాభావ పరిస్థితులలో నారు పోయడానికి కూడా రైతు నీరు వెదుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. అధిక దిగుబడి కోసమని మనదేశంలోకి ప్రవేశించిన రసాయన ఎరువులు, పురుగుమందులు భూసారాన్ని పీల్చి పిప్పి చేశాయి. కొన్ని తరాల కళ్లెదుటే చోటు చేసుకున్న ఈ పరిణామాలు రైతుకు శాపంగా మారాయి. ఈ నేపథ్యంలో భారతీయతకు నిదర్శనమైన సహజ వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ, గ్రామీణులు స్వంత ఊరిలోనే ఆత్మాభిమానం కలిగిన రైతులుగా జీవనం సాగించేలా మార్గం చూపడానికి ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండే షన్ ముందుకు వచ్చింది. కేవలం వారికి పూర్వవైభవం తీసుకురావ డంతో సరిపుచ్చక విద్య, వైద్యం వంటి రంగాల్లో గ్రామీణుల వెంట నడుస్తూ, తనతో నడిపిస్తూ గ్రామం కేంద్రంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఇదంతా గ్రామీణ వికాసం కోసం, నగరాలకు వలసలు పోకుండా స్వగ్రామంలోనే ప్రశాంత వాతావరణంలో రైతులకు ఆదాయాన్ని ఇచ్చే వృత్తి, వ్యాపకాలను కల్పించడంలో భాగం అని ‘జాగృతి’తో ముఖాముఖిలో ఫౌండేషన్ ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) వల్లభజోస్యుల శ్రీనివాస్ తెలిపారు.

మనం మనవారి కోసం పనిచేయాలి

గ్రామాలలో కష్టపడి పనిచేసే రైతులకు వ్యవసాయ ఉత్పత్తులు, నిత్యావసర వస్తువులు, షాంపూ, ఫినాయిల్, నూనెలు, సబ్బులు, మునగాకు, మొరింగ, అర్జున టీ లాంటి ఉత్పత్తుల ద్వారా గ్రామాలలో ఉంటూనే ఆర్థికసమృద్ధితో జీవించే స్థితి రావాలి. యోగ ద్వారా మంచి ఆరోగ్యం, సాంస్కృతిక కార్యక్రమాలు ద్వారా మానవ జీవన విలువల నిర్మాణం మనందరి బాధ్యత. గ్రామవికాసానికి పెద్దలు, యువతీయువకులు తమ అమూల్యమైన జీవితాన్ని సమర్పించాలి. జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. రండి, ముందుకు రండి.. చేయిచేయి కలుపుదాం. రసాయన విషాలులేని ఆరోగ్యవంతమైన భోజనాన్ని సమాజానికి అందిద్దాం.