ArticlesNews

విశ్వవ్యాప్తం.. హిందుత్వం 1 వ భాగం

59views

అమెరికాలోని జార్జియా రాష్ట్రం హిందూ వ్యతిరేక ద్వేషాన్ని ఖండిస్తూ ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ఇటీవల ఆమోదించింది. ఈ సందర్భంగా భారతీయసంతతికి చెందిన అమెరికా దేశస్థులను ఉద్దేశించి అమెరికా కాంగ్రె స్ సభ్యుడు  శాన్‌ఫోర్డ్ బిషప్ ప్రసంగిస్తూ, హిందూ వ్యతిరేక ద్వేషాన్ని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన మొట్టమొదటి అమెరికా రాష్ట్రంగా జార్జియా నిలిచిందని పేర్కొన్నారు. మనం హిందూ వ్యతిరేక భావజాలానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలి అని అన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  తన గురించి ఒక హిందువుగా చెప్పుకోవడానికి తానెంతో గర్విస్తానని తెలిపారు. తాను బలమైన హిందూ కుటుంబంలో పెరిగానని చెప్పారు. మతం మార్చుకోవాల్సిన అవసరం కానీ, భావన కానీ తనకు ఎప్పుడూ రాలేదని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల్లో ఒకటి హిందూ వ్యతిరేక ద్వేషాన్ని ఖండిస్తూ  జార్జియా రాష్ట్రం తీర్మానం చేయడమైతే మరొకటి హిందుత్వం పట్ల ప్రగాఢమైన విశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి బహిరంగంగా ప్రకటించడంగా ఉంది.  ఈ రెండు సంఘటనలూ చాలా ముఖ్యమైనవి. నేటి అంతర్జాతీయ సమాజానికి దిక్సూచి లాంటివి. నిజానికి, హిందుత్వంకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఒక బహుముఖమైన, భిన్నమైన చర్చ జరుగుతోంది. పాశ్చాత్య దేశాలలో, ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి పెరుగుతున్న దౌత్య, ఆర్థిక పలుకుబడితో పాటు, వసుధైవ కుటుంబకం అనే సార్వత్రిక విలువల ద్వారా మానవాళిలో అత్యధికం హిందుత్వంకు సమున్నతమైన గౌరవాన్ని అందిస్తున్నారు.

ఇదే సమయంలో వామపక్ష భావజాలం కలిగిన అనేక వర్గాలు, మీడియా సంస్థలు హిందుత్వంపై ప్రతికూల ప్రచారాన్ని సృష్టించే ప్రయత్నాల్లో నిరంతరం నిమగ్నమై ఉంటున్నాయి. ఇటీవల పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలు వీటికి కంటగింపుగా మారాయి. మే 22న “హిందుత్వం అంటే ఏమిటి.. ఈ రాజకీయ ఉద్యమ మూలాలు ఏమిటి?” అనే శీర్షికతో అల్‌జజీరా ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో హిందుత్వకు వ్యతిరేకంగా చేసిన వాదనలు, ‘హిందుత్వ’ అనే పదాన్ని 1923లో వినాయక్ దామోదర్ సావర్కర్ మొదటిసారిగా ఉపయోగించారనే అంచనాపై ఆధారపడి ఉన్నాయి. ది న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్, అల్‌జజీరా వంటి మీడియా సంస్థలు భారతదేశం ఒక రకమైన హిందూ జాతీయవాదం వైపు పయనిస్తోందని, దానివల్ల ప్రజాస్వామ్యం, బహుళత్వం ప్రమాదంలో పడతాయనే ఒక కథనాన్ని వండి వడ్డించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి.

వాస్తవానికి హిందుత్వంపై జరిగే చర్చలో ఆరోపణలు అధికంగా ఉంటాయే తప్ప స్పష్టత ఇసుమంత కూడా ఉండదు. ఒక నగరంలో ఏదైనా నేరపూరిత సంఘటన జరిగిందనుకుందాం. ఆ సంఘటనకు మొత్తం నగరాన్నే బాధ్యులను చేయడం సమంజసం కాదు. అదేవిధంగా కేవలం ఒక సంఘటన లేదా అతివాదుల చర్యల ఆధారంగా మొత్తం హిందూ సమాజాన్ని లేదా దాని సాంస్కృతిక సంప్రదాయాన్ని నిందించినట్లయితే, ఆ చర్చ తన అసలు ఉద్దేశం నుంచి పక్కదారి పడుతుంది. ఏదైనా గంభీరమైన చర్చ ఒక నిర్వచనంతోనే మొదలవు తుంది. చర్చనీయాంశం ‘హిందూ ధర్మం’ అయితే, అలాంటి ఒక చర్చ ధార్మికమైన, తాత్విక కోణాలపై ఆధారపడి ఉండాలి. అదే ‘హిందుత్వం’ గురించి అయితే దాని చారిత్రక, సాంస్కృతిక, సైద్ధాంతిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ విషయం ఏదైనా రాజకీయ పార్టీ లేదా సంస్థకు సంబంధించినదైతే, దానిపై చేసే విశ్లేషణ రాజకీయ ప్రాతిపదికన ఉండాలి. అయితే, వీటన్నింటినీ కలిపి గందరగోళం సృష్టించినప్పుడే సమస్య తలెత్తుతుంది.

2021లో ‘డిస్‌మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వం’ (ణGH) పేరుతో ఒక అంతర్జాతీయ ఆన్‌లైన్ సదస్సు జరిగింది. వివిధ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థ లకు చెందిన అధ్యాపకులు, పరిశోధకుల బృందం దీనిని ఏర్పాటు చేసింది. స్టాన్‌ఫోర్డ్, హార్వర్డ్, ప్రిన్స్‌టన్, యూనివర్సిటీ ఆఫ్ చికాగో, కార్నెల్, న్యూయార్క్ యూనివర్సిటీ వంటి 50కి పైగా విశ్వవిద్యాలయాల విభాగాలు, కేంద్రాలు ఈ కార్యక్రమానికి సహ-ప్రాయోజకులుగా వ్యవహ రించాయి. ఈ సందర్భంలో హిందుత్వాన్ని అధిక సంఖ్యాకవాదానికి రూపంగా, అల్పసంఖ్యాక వర్గీయుల హక్కులకు ముప్పుగా చిత్రీకరించారు. అలా ప్రతిపాదించినవారు తాము చేపట్టిన చర్చను ఒక సైద్ధాంతికమైన, విద్యాపరమైన చర్చగా నమ్మబలికారు. అయితే ఇక్కడ విమర్శ జరిగిందన్నది ముఖ్యం కాదు. దానికి బదులుగా భారతీయ నాగరికత, హిందూ భావధార, సాంస్కృతిక అస్తిత్వానికి సంబంధించిన చర్చ, వాదోపవాదాల పరిధి ప్రపంచస్థాయిలో నిరంతరాయంగా విస్తరిస్తోం దని ఇటువంటి సంఘటనలు సూచిస్తున్నాయి.

నేటి ప్రపంచం ఒకప్పటిలా లేదు. ఆలోచనలు ఇకపై దేశ సరిహద్దులకు పరిమితం కానేకావు. విశ్వవిద్యాలయ పరిశోధనలు, అంతర్జాతీయ సంస్థల నివేదికలు, మీడియా చర్చలు, డిజిటల్ వేదికలపై ప్రచారాలు, ప్రవాస సమాజాలలోని సంభాషణలు అన్నీ కలిసి ఒక ప్రపంచవ్యాప్త చర్చను రూపొందిస్తు న్నాయి. తత్ఫలితంగా ఏదైనా భావజాలం, అస్తిత్వం లేదా సాంస్కృతిక సమూహం గురించిన అభిప్రాయాలు కేవలం స్థానికంగానే మిగిలిపోవు. అవి అంతర్జాతీయ సమాజం దృష్టికి వస్తున్నాయి. కనుక ఏదైనా వేదికపై హిందుత్వాన్ని ఒక నిర్దిష్ట దృక్పథంతో ప్రస్తావించినప్పుడు, దాని ప్రభావం కేవలం ఆ సభా ప్రాంగణానికే పరిమితం కాదని గుర్తుంచుకోవాలి. అక్కడ ప్రస్తావించిన విషయాలు వ్యాసాలుగా రూపాంతరం చెందుతాయి. ఆ వ్యాసాలు చర్చలకు దారితీస్తాయి. ఆ చర్చలు సోషల్ మీడియాకు చేరతాయి. క్రమంగా అవి ఒక స్థిరమైన అభిప్రాయం లేదా దృక్పథంగా మారిపోతాయి.