
గౌర – నితాయ్ (జగన్నాథ, బలదేవ, సుభద్ర) రథయాత్రను నెల్లూరు నగరంలో అంగరంగవైభవంగా నిర్వహించారు. ఇస్కాన్, నెల్లూరు శాఖ అధ్యక్షుడు శుకదేవస్వామి పర్యవేక్షణలో సాగిన రథయాత్రను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు, నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్రెడ్డి ప్రారంభించారు. బారకాస్ సెంటర్ నుంచి ప్రారంభమైన రఽథయాత్ర వివిధ ప్రాంతాల మీదుగా టీటీడీ కల్యాణ మండపానికి చేరుకుంది.
కృష్ణ నామస్మరణతో సమస్యలు దూరం
కృష్ణ భగవానుడి నామస్మరణతో ఎలాంటి సమస్యలు దరిచేరవని దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇస్కాన్ మందిర నిర్వాహకులు తెలిపారు. తొలుత పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే వస్త్ర సంచులు, టీ షర్టులు, గౌర – నితాయ్ లీలలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. దాతలు మాలతిలత, సుధాకర్రావు, సుమతి, నెల్లూరు ఏఎస్పీ దీక్ష తదితరులకు వీటిని అందజేశారు. 56 వంటకాలతో నివేదన, హారతి కీర్తన, దీపహారతులను ఇచ్చారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.





