
చాలా కాలంగా ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్ అప్పులతోనే నెట్టుకొస్తోంది. మిత్రదేశాల నుంచి రుణాలు తీసుకుని కాలం గడుపుతోంది. ఈ అప్పుల గురించి పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తాజాగా మాట్లాడారు. మిత్ర దేశాలకు వెళ్లి అప్పులు అడగడం చాలా సిగ్గుగా అనిపించిందని అందరి ముందు ఆయన అంగీకరించారు. తాజాగా ఇస్లామాబాద్లో ఎగుమతిదారులు, వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు
‘ఆర్మీ చీఫ్ మునీర్, నేను కలిసి రహస్యంగా మిత్ర దేశాల వద్దకు వెళ్లి అప్పులు అడిగాం. అలా అడగడం నాకు చాలా సిగ్గుగా అనిపించింది. ఎవరి దగ్గరైనా అప్పులు తీసుకోవడం ఆత్మగౌరవానికి పెద్ద దెబ్బ. వారు ఏమి డిమాండ్ చేసినా సరే.. అంగీకరించి తీరాల్సిందే. అయితే చాలా దేశాలు రుణాలు ఇచ్చే విషయంలో నిరాశపరచలేదు. పరిస్థితులతో సంబంధం లేకుండా పాక్కు మద్దతుగా నిలిచిన సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, చైనా వంటి దేశాలకు ధన్యవాదాలు’ అని షరీఫ్ వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్కు ఆర్థిక సహాయం చేసిన దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉందని షరీఫ్ అన్నారు. ఇతర దేశాల నుంచి అప్పులు తీసుకోవాల్సి రావడంపై షరీఫ్ గతంలో కూడా నిరాశ వ్యక్తం చేశారు. అయితే పాక్ ఆర్థిక పరిస్థితి ప్రకారం అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొందని గతంలో అసహాయత వ్యక్తం చేశారు. పాకిస్థాన్లో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోవడం గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు





