
రొహింగ్యాలు శరణార్థులా? లేదంటే దేశంలో అక్రమంగా ప్రవేశించిన చొరబాటుదార్లా అన్నదే ప్రధాన సమస్య అని, దీన్ని మొదట తేల్చాల్సి ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది తేలితే ఇతర సమస్యలను పరిష్కరించడం తేలికవుతుందని తెలిపింది. దేశంలోని రొహింగ్యాలపై దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. మయన్మార్, బంగ్లాదేశ్ల నుంచి వచ్చిన రొహింగ్యాలను శరణార్థులుగా ప్రకటించవచ్చా? ఒకవేళ అలాంటి గుర్తింపు ఇస్తే వారికి కలిగే హక్కులు, సౌకర్యాలు, రక్షణలు ఏమిటని ప్రశ్నించింది. ఒకవేళ అక్రమ చొరబాటుదార్లుగా గుర్తిస్తే వారిని తిప్పిపంపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సమర్థనీయమేనా అని అడిగింది. అక్రమ చొరబాటుదార్లే అయితే వారిని చిరకాలం పాటు నిర్బంధంలో ఉంచవచ్చా? బెయిల్పై విడుదల చేస్తే ఎలాంటి షరతులు విధించాలి? అన్న ప్రశ్నలు తలెత్తుతాయని తెలిపింది. ఈ సమస్యల ఆధారంగా చేసుకొని దాఖలైన పిటిషన్లను మూడు వర్గాలుగా విభజించి ప్రతి బుధవారం విచారణ జరపనున్నట్టు పేర్కొంది.





