News

కోల్‌కతా ట్రామ్‌లో దుర్గాపూజను ప్రతిబింబించే పెయింటింగ్‌లు

442views

కోల్‌కతాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ట్రామ్‌ (వీధుల్లో రోడ్లపై నడిచే రైళ్లు) సర్వీసు ఈ ఏడాది 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దుర్గా పూజా క్రమాన్ని ప్రతిబింబించేలా వాటిపై వివిధ పెయింటింగ్‌లు వేశారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ ట్రామ్‌ సర్వీస్‌ నగరంలోని బాలిగంజ్‌- టోలిగంజ్‌ వరకు ఈ నెల 16 నుంచి ఏడాది చివరి వరకు నడుస్తుందని బెంగాల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజన్‌వీర్‌సింగ్‌ కపూర్‌ తెలిపారు. ఇటీవల కోల్‌కతా దుర్గాపూజకు యునెస్కో గుర్తింపు లభించిన నేపథ్యంగానూ దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ రైళ్ల లోపల కూడా కోల్‌కతా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రాలను వేశారు. దేవత ముందు ప్రదర్శించే సింధూర్‌ ఖేలా (మహిళా భక్తులు ఎరుపు రంగు పూసుకోవడం), ధనుచి నృత్యం, ఢాకీలు (పురాతన వాయిద్యం), వారసత్వ ప్రదేశాలు వంటివి ఇందులో ఉన్నాయి. మన దేశంలో ట్రామ్‌ సేవలు కలిగి ఉన్న ఏకైక నగరం కోల్‌కతా. సాధారణంగా ఈ రైళ్లు రెండు బోగీలు కలిగి ఉంటాయి.