
భారత సంస్కృతితో ముడి పడి, దేశానికి మాత్రమే సొంతమైన అరుదైన యుద్ధ రీతులు, వ్యూహాలను రిఫర్ చేసుకోవడానికి.. దీంతో పాటు దౌత్య విధానాన్నీ పరిశీలించేందుకు భారత ఆర్మీ ఒక ప్రాజెక్ట్ ను చేపడుతునట్లు తెలిపింది. ఈ ప్రాజెక్ట్కి “ప్రాజెక్ట్ ఉద్భవ్” అనే పేరు పెట్టింది. ఇందుకోసం రక్షణ రంగానికి చెందిన యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా-USI సహకారం తీసుకోనుంది. ఈ క్రమంలోనే…అక్టోబర్ 21,22వ తేదీల్లో USI మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ని నిర్వహించనునట్లు తెలిపింది. దేశ భద్రత విషయంలో భారత వ్యూహాలు, మిలిటరీ సామర్థ్యాలు, భద్రతా బలగాల నవీకరణతో పాటు ఆత్మనిర్భర భారత్ గురించి ఈ ఫెస్టివల్లో చర్చించనున్నారు.
యుద్ధ రీతులపై అధ్యయనం..
చరిత్రలో ఆయా రాజ్యాల్లోని యుద్ధ కళలు, రీతులను పరిశీలిస్తూనే ఇప్పటి కాలానికి తగ్గట్టుగా వాటిని ఎలా వినియోగం చేసుకోవచ్చో అధ్యయనం చేయనున్నారు. రాజ్యాలు తమ సైన్యాలను ఎలా శక్తివంతంగా మార్చుకున్నాయి..? కాలం గడిచే కొద్ది ఎలాంటి సంస్కరణలు జరిగాయి..? తమ నేలను ఎలా కాపాడుకున్నాయి..? అనే అంశాలపైనే ఎక్కువగా ఈ ప్రాజెక్ట్ ఉద్భవ్ పని చేయనుంది .




