
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని హిందూ దేవాలయాలు, మఠాలు, ధార్మిక సంస్థల నిర్వహణను పర్యవేక్షించే హిందూ మత, ధర్మాదాయ శాఖకు ప్రత్యేక పరిపాలనా హోదా కల్పించింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలు, మఠాలు, ధార్మిక సంస్థల పరిపాలన, నిర్వహణ, నియంత్రణ బాధ్యతలను హిందూ మత, ధర్మాదాయ శాఖ నిర్వహిస్తుంది. హిందూ, జైన మత సంస్థలకు సంబంధించిన వ్యవహారాలను కూడా ఈ శాఖ పర్యవేక్షిస్తుంది.
ఇటీవల చేపట్టిన పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా హిందూ మత, ధర్మాదాయ శాఖను పర్యాటక, సాంస్కృతిక, మత ధర్మాదాయ శాఖ పరిధి నుంచి వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోకి మార్చారు. శాఖ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే ఈ మార్పు ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది.
ఇప్పుడు తాజాగా ఈ శాఖకు ప్రత్యేక హోదా కల్పించడంతో దేవాలయాల నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలను ప్రత్యేకంగా పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. దేవాలయాల నిర్వహణ, ఆస్తులు, ధార్మిక కార్యక్రమాలు, నిధుల వినియోగం వంటి అంశాల్లో ఈ శాఖకు కీలక బాధ్యతలు ఉన్నాయి.
దేవాలయాలపై ప్రత్యేక దృష్టి
విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల నిర్వహణకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల రాష్ట్రంలోని 52 ప్రధాన దేవాలయాల్లో కెమెరా ఉన్న మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడం, వాటిని ఉపయోగించడంపై ఆంక్షలు విధించింది.
దేవాలయాల్లో ఫొటోలు, వీడియోలు తీసే అవకాశాన్ని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కెమెరా ఉన్న మొబైల్ ఫోన్లతో వచ్చే భక్తులు వాటిని నిర్ణీత కౌంటర్ల వద్ద భద్రపరచాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్కో ఫోన్కు రూ.5 రుసుము వసూలు చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. కెమెరా లేని మొబైల్ ఫోన్లను మాత్రం దేవాలయాల్లోకి అనుమతిస్తున్నారు.
దేవాలయ నిధుల వినియోగంపై చర్చ
దేవాలయాలకు వచ్చే ఆదాయం, నిధుల వినియోగం కూడా తమిళనాడులో చాలాకాలంగా చర్చనీయాంశంగా ఉంది. దేవాలయాల ఆదాయాన్ని ధార్మిక కార్యక్రమాలు, ఆలయాల నిర్వహణ, భక్తులకు అవసరమైన సౌకర్యాల కోసం వినియోగించాలనే డిమాండ్లు హిందూ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో హిందూ మత, ధర్మాదాయ శాఖకు ప్రత్యేక హోదా కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేవాలయాల ఆస్తులు, నిధుల పరిరక్షణతో పాటు పరిపాలనలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని భక్తులు, హిందూ సంఘాలు కోరుతున్నాయి.





