ఎడ్మంటన్: కెనడాలోని ఎడ్మంటన్లోని నానక్సర్ గురుద్వారాలో ఒక దుండగుడు స్క్రూడ్రైవర్తో వీరంగం సృష్టించాడు. ప్రార్థనల వేళ జరిగిన ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు 27 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈశాన్య ఎడ్మంటన్లోని గురుద్వారా సముదాయంలోకి ఉదయం 5 గంటల ప్రాంతంలో నిందితుడు చొరబడ్డాడు. ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించేందుకు యత్నిస్తుండగా అడ్డుకున్న ఇద్దరు భక్తులపై స్క్రూడ్రైవర్తో విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్కడే ఉన్న భక్తులు, ప్రత్యక్ష సాక్షులు వెంటనే స్పందించి నిందితుడిని అడ్డుకుని, పోలీసులకు అప్పగించారు. గాయపడిన బాధితులతో పాటు నిందితుడిని కూడా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.
నిందితుడికి నేర చరిత్ర ఉన్నట్లు ఎడ్మంటన్ పోలీస్ సర్వీస్ (ఈపీఎస్)యాక్టింగ్ ఇన్స్పెక్టర్ ఎరిక్ స్టీవర్ట్ మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీస్ అధికారిపై దాడి, తీవ్రమైన నేరారోపణల కింద జైలు శిక్ష అనుభవించిన అతను గురువారమే విడుదలైనట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం అతను ఎడ్మంటన్లోని హాఫ్వే హోమ్కు వెళ్లాల్సి ఉండగా, అక్కడకు వెళ్లకుండా గురుద్వారా పరిసరాల్లోకి ఎందుకు వచ్చాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇది ద్వేషపూరిత నేరమా కాదా అనే అంశంపై ప్రత్యేక బృందం విచారిస్తోంది.
ఘటనపై కెనడా ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి
ఈ దాడిని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ తీవ్రంగా ఖండించారు. ప్రార్థనా స్థలాల్లో ఎవరూ అభద్రతా భావానికి గురికాకూడదని పేర్కొంటూ బాధితులకు, సిక్కు సమాజానికి సంఘీభావం తెలిపారు. తక్షణమే స్పందించి నిందితుడిని పట్టుకున్న పోలీసులను ఆయన అభినందించారు.





