
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మణి చక్రవర్తి అనే ఓ కిరాణా దుకాణ వ్యాపారిపై గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. రాణాప్రతాప్ బైరాగి అనే జర్నలిస్టు హత్య జరిగిన కొన్ని గంటల్లోనే మరో ఘటన చోటుచేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.
నర్సింగ్డి జిల్లాలో అత్యంత రద్దీగా ఉండే చార్సిందూర్ బజార్లో ఈ హత్య జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మణి చక్రవర్తి స్థానిక మార్కెట్లో ఓ కిరాణా దుకాణాన్ని నడుపుతున్నాడు. సోమవారం రాత్రి దుకాణంలో ఉండగా.. కొందరు దుండగులు షాపులోకి చొరబడి పదునైన ఆయుధాలతో అతనిపై దాడి చేశారు. ఈ ఘటనలో మణి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. మణి చక్రవర్తి చాలా మంచి వ్యాపారి అని, అతనికి ఎవరితోనూ విభేదాలు లేవని తోటి వ్యాపారులు తెలిపారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో తాము భయాందోళనకు గురవుతున్నామని, బాధ్యులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్యతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి దేశంలోని హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొత్తం 18 రోజుల్లో ఆరుగురు హిందువులు హత్యకు గురవడం ఆందోళన కలిగిస్తోంది.





