News

ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అదనంగా ప్రోత్సహకాలు ఇవ్వాలి: మాధవ్

281views

ప్రకృతి వ్యవసాయం చేసే వారికి అదనంగా రూ.4 వేలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. విజయవాడలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై సహజ రైతు సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సేంద్రీయ వ్యవసాయ విధానంతో మంచి దిగుబడి సాధించిన అన్నదాతలను మాధవ్ సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడారు మాధవ్. ప్రకృతి వ్యవసాయం చేసే వారి ఇబ్బందులు, కొత్త పద్ధతులు, ఆదర్శవంతమైన సాగు‌చేసే వారితో నేడు ఈ సదస్సు ఏర్పాటు చేశామని వెల్లడించారు పీవీఎన్ మాధవ్.

ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా విజయవంతమైన రైతన్నల అభిప్రాయాలు, అనుభవాలు వివరించారని అన్నారు. ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. జాతీయ, ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయంపై అనేక కొత్త పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఫసల్ భీమా, రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సీడీ ఇచ్చేలా భరోసా ఇచ్చారని వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం చేసే వారిని అన్ని‌విధాలా ప్రోత్సహించాలని సూచించారు. దేశం‌లో ముప్పై శాతం మంది ప్రకృతి వ్యవసాయం రావాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని అన్నారు. ఆర్థిక స్వావలంబన కావాలంటే ప్రకృతి వ్యవసాయ విధానమే మార్గమని చెప్పుకొచ్చారు పీవీఎన్ మాధవ్.

ఇతర దేశాలపై ఆధారపడి యూరియా, పురుగు మందులు కొనే విధానం ఆగిపోవాలని సూచించారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. రైతు బజార్లలో కొన్ని స్టాల్స్‌ను పెడుతున్నారని వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చిన ఉత్పత్తులతో ప్రత్యేకంగా సంతలు, రైతు బజార్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు. కేంద్రం అమలు చేసే పథకాల గురించి అందరూ తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందరూ ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లేలా ప్రోత్సహించాలని కోరారు. ఈరోజు సదస్సులో చేసిన తీర్మానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివరిస్తామని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించాలని పీవీఎన్ మాధవ్ సూచించారు.