
జమ్మూ కశ్మీర్పై బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీవోకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్లో విలీనం చేయాలని భారత ప్రభుత్వానికి సూచించారు. కశ్మీర్ను పాక్ ఆక్రమించడాన్ని తాను గతంలోనూ వ్యతిరేకించానని.. ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటానన్నారు. ఆర్టికల్ 370 రద్దును ఇప్పుడు కాకుండా 1992లో కశ్మీరీ పండితుల వలసల కన్నా ముందే చేపట్టాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జైపుర్లో జరిగిన హై టీ కార్యక్రమంలో బ్రిటన్ ఎంపీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అక్రమంగా ఆక్రమించడమే కాకుండా.. పీవోకే ప్రాంతంలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విస్తరిస్తుండం సరైన చర్య కాదని బాబ్ బ్లాక్మన్ అన్నారు. జమ్మూ కశ్మీర్ మొత్తాన్ని భారత్లో విలీనం చేసుకోవాలని తాను అనేకసార్లు సూచించినట్లు తెలిపారు. గతేడాది పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కొన్నేళ్లుగా జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు మెరుగుపడుతుండడంతో అక్కడ శాంతి నెలకొందని తాను భావించానని.. కానీ పహల్గాం దాడితో ఉగ్ర సమస్య మళ్లీ వెలుగులోకి వచ్చిందన్నారు. భారత సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని విస్తరిస్తే ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురయ్యే అవకాశం ఉంటుందని.. పాక్ను హెచ్చరించారు.





