
విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పట్టణ ప్రజల ఇలవేల్పు వేణుగోపాలస్వామి వారి రథయాత్రను పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆలయ అనువంశిక ధర్మకర్త ప్రతినిధి, ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు (బేబీనాయన) తెలిపారు. ఆలయ ఈవో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
నాడు జరిగిన ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఏటా దీపావళి నాడు స్వామివారి రథయాత్ర నిర్వహించడం తమ పూర్వీకులకు ఆనవాయితీగా ఉండేదని తెలిపారు. సుమారు 90 ఏళ్ల క్రితం (1930 దశకంలో) బొబ్బిలిలో రథయాత్ర జరుగుతుండగా అదే రోజు కాంగ్రెస్ పార్టీ తరపున జవహర్లాల్ నెహ్రూ సభ కూడా ఏర్పాటు చేశారని, అధికంగా జనం చేరడంతో సభ రసాభాస అయిందని, ఈ ఘటనతో నెహ్రూ బొబ్బిలి రాజులను అపార్థం చేసుకున్నారని, ఇకపై రథోత్సవాన్ని నిలిపేయాలని అర్చకస్వాములను ఆదేశించారని, నాటి నుంచి రథయాత్ర వేడుక జరగలేదని వివరించారు. బొబ్బిలి ప్రాంత ప్రజలను చల్లగా దీవిస్తున్న స్వామివారికి రథయాత్ర జరిపించకపోవడం పెద్దలోటుగా భావించి చినజీయర్స్వామిని సంప్రదించామని, ఆయన ఆదేశాల మేరకు ఆగమశాస్త్రం ప్రకారం సుమారు రూ.40 లక్షలు వెచ్చించి 27 అడుగుల రథం తయారీకి సన్నాహాలు చేస్తున్నామన్నారు. వచ్చే దీపావళి నుంచి బొబ్బిలి వేణుగోపాలస్వామి రథయాత్రను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రథానికి అవసరమైన నిధులు సమకూర్చాలనుకునే భక్తులు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావచ్చని ఎమ్మెల్యే బేబీనాయన ఆహ్వానించారు. సమావేశంలో ఆలయ ఈవో లక్ష్మణరావు, స్థానిక నాయకులు అల్లాడ భాస్కరరావు, లంక రమేష్, నంది హరి, చింతాడ రవి, ధూపంవాసు తదితరులు పాల్గొన్నారు.





