
తిరుపతిలోని కపిల తీర్థం పుష్కరిణిలో అయ్యప్ప మాల ధరించిన భక్తుల స్నానాలకు టీటీడీ అనుమతి ఇవ్వకపోవడంతో మాల ధరించిన స్వాములు ఆందోళనకు దిగారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి వ్యతిరేకంగా అయ్యప్ప భక్తులు నినాదాలు చేశారు.
వివరాల ప్రకారం.. తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద అయ్యప్ప భక్తులు ఆందోళన దిగారు. కపిల తీర్థం పుష్కరిణిలో అయ్యప్ప మాల ధరించిన భక్తుల స్నానాలకు టీటీడీ అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో తెల్లవారుజామున స్నానం ఆచరించే అయ్యప్ప భక్తుల పట్ల టీటీడీ కఠినంగా వ్యవహరిస్తోందని స్వాములు ఆరోపించారు. వైఖరిపై భక్తులు, స్వాములు మండిపడుతున్నారు. ఎట్టకేలకు అయ్యప్ప భక్తుల ఆందోళనతో దిగివచ్చిన టీటీడీ వారి స్నానాలకు అనుమతి ఇచ్చింది.
అయితే, కార్తీక మాసం ప్రారంభం నుంచి కోనేరులో భక్తుల స్నానాలకు, దీపారాధనకు టీటీడీ అనుమతి ఇవ్వలేదు. భక్తుల తాకిడి తక్కువగా ఉన్నప్పటికీ భక్తులపై విజిలెన్స్ అధికారులు ఆంక్షలు విధించారు. ఆలయంలో రద్దీ తగ్గుముఖం పట్టినప్పటికీ విజిలెన్స్ అధికారులు అత్యుత్సాహం చూపించారు. దీంతో, తమకు కార్తీక మాసంలో కపిలేశ్వర స్వామి సన్నిధిలో కోనేరు దర్శనాన్ని దూరం చేస్తున్నరని భక్తులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భక్తులు ఆందోళనకు దిగడం గమనార్హం. దీంతో, టీటీడీ దిగి వచ్చింది.





