
వివాదాస్పద వ్యాఖ్యలతో తరచు వార్తల్లో ఉంటే కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు తనకు సొంత ఇంట్లో ఉన్నట్టుందని, పొరుగుదేశాలైన పాక్, బంగ్లా, నేపాల్తో ఇండియా బలమైన సంబంధాలు ఏర్పరచుకోవాలని ఆయన వ్యాఖ్యనించారు. భారత విదేశాంగ విదానంపై ఆయన చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. ఇస్లామాబాద్ పట్ల కాంగ్రెస్ మెతక వైఖరిని దుయ్యపట్టింది.
పొరుగుదేశాలలో మెరుగైన సంబంధాలు
భారత విదేశాంగ విధానంపై చర్చలో శామ్ పిట్రోడా పాల్గొంటూ.. పొరుగుదైశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్తో పటిష్ట సంబంధాలకు భారత్ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తన వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తూ, తాను పాకిస్థాన్ వెళ్లినప్పుడు సొంతింట్లో ఉన్నట్టే అనిపించిందని, బంగ్లాదేశ్, నేపాల్ కూడా వెళ్లానని, అక్కడ కూడా విదేశాల్లో ఉన్నట్టుగా కాకుండా సొంత ఇంట్లో ఉన్నట్టుగానే అనిపించిందని చెప్పారు. ఈ దేశాలన్నీ ఒకేరకమైన డీఎన్ఏ కలిగి, సాంస్కృతిక సారూప్యాలు ఉన్నందున ఆయా దేశాలతో సన్నిహత సంబంధాలు కలిగి ఉండాలన్నారు.
అర్ధంలేని సానుభూతి
పిట్రోడా వ్యాఖ్యలను పాక్పై ‘తప్పుడు సానుభూతి’గా బీజేపీ విమర్శించింది. ‘పాకిస్థాన్లో ఉంటే సొంతింట్లో ఉన్నట్టు ఉందని రాహుల్కు బాగా ఇష్టమైన వ్యక్తి, కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ శామ్ పిట్రోడా ఉంటున్నారు. 26/11 దాడుల తర్వాత కూడా పాక్పై యూపీఏ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. పాకిస్థాన్కు ఫేవరెట్గా ఉన్న వ్యక్తినే కాంగ్రెస్ ఎంచుకుంది’ అని శామ్ పిట్రోడాను, కాంగ్రెస్ పార్టీని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారి తప్పుపట్టారు. కాగా, శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించలేదు.
గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు
విదేశాంగ విధానంపై శామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గత ఫిబ్రవరిలోనూ ఇండియా-చైనా సంబంధాలపై ఆయన న్యూఢిల్లీ వైఖరిని తప్పుపట్టారు. అమెరికా ప్రభావంతో బీజింగ్ నుంచి ముప్పును భారత్ అతిగా ఊహించుకుంటోందన్నారు. చైనా నుంచి ఎలాంటి ముప్పు ఉందో తనకు అర్ధం కావడం లేదని, దేశాలు ఘర్షణలు కాకుండా కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.





