News

భారత వాయుసేన అమ్ములపొదిలో కొత్త అస్త్రం తేజస్ ఎంకె1ఎ

331views

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ఎంకె1ఎ సీరీస్‌లో మొట్టమొదటి విమానం ఎల్ఎ5033 మొదటి గగనవిహారం విజయవంతమైంది. బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కేంద్రంలో గురువారం సాయంత్రం ఆ ప్రయోగం చేపట్టారు.

తేజస్ ఎంకె1ఎ ఎయిర్‌క్రాఫ్ట్ 18 నిమిషాల పాటు గగనవీధిలో ఏ సమస్యలూ లేకుండా విజయవంతంగా విహరించింది. చీఫ్ టెస్ట్ పైలట్ గ్రూప్ కెప్టెన్‌గా పదవీ విరమణ చేసిన కెకె వేణుగోపాల్ ఈ తేజస్ విమానం మొదటి గగన విహారానికి పైలట్‌గా వ్యవహరించారు.

‘‘2021 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరిన తర్వాత అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ వాతావరణం మారిపోయింది. దాంతో సరఫరా వ్యవస్థ దెబ్బతింది. ఫలితంగా ఈ విమానం తయారీలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాం. అయినా ముందు అనుకున్న డిజైన్ ప్రకారమే హెచ్ఏఎల్ ఈ విమానాన్ని నిర్మించగలిగింది’’ అని హెచ్ఏఎల్ సీఎండీ సిబి అనంతకృష్ణ వెల్లడించారు.

తేజస్ ఎంకె1ఎ విమానంలో అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ రాడార్, యుద్ధోపకరణాలు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, మెరుగైన మెయింటెనెన్స్, అడిషనల్ కంబాట్ కేపబిలిటీ ఉన్నాయని హెచ్ఏఎల్ చెప్పుకొచ్చింది. ఈ విమానాన్ని భారత వాయుసేనలో ఇక ఏ క్షణంలోనైనా చేర్చుకోవచ్చునని హెచ్ఏఎల్ ధ్రువీకరించింది. త్వరలోనే పెద్దసంఖ్యలో ఈ విమానాలను ఉత్పత్తి చేస్తామని వివరించింది.