News

రేపు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–14 ప్రయోగం

280views

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాలులో గురువారం మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (ఎంఆర్‌ఆర్‌) సమావేశం నిర్వహించిన తర్వాత ప్రయో గ పనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యా బ్‌) వారికి అప్పగించారు.

అనంతరం లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు చైర్మన్‌ ఆర్ముగం రాజ రాజన్‌ ఆధ్వర్యంలో మరోసారి ల్యాబ్‌ సమావేశం నిర్వహించారు.శుక్రవా రం మధ్యాహ్నం 2.05 గంటల నుంచి 27.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–14 రాకెట్‌ను ప్రయోగిస్తారు. మొత్తం 2,272 కిలోలు బరువు కలిగిన ఇన్‌శాట్‌–3డీఎస్‌ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టేలా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని డిజైన్‌ చేశారు. ఇది షార్‌ కేంద్రం నుంచి 92వ ప్రయోగం కాగా, జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 16వ ప్రయోగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్‌ ఇంజిన్లు తయారు చేసుకుని చేస్తున్న 10వ ప్రయోగం కావడం విశేషం.