News

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గం : 1992లో రామమందిర ఉద్యమంలో పాల్గొన్నవారి అరెస్ట్

464views

అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగే రోజు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ నైజం మరింత బైటపడుతోంది. ఆ శుభ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఆహ్వానించినా ఇప్పటివరకూ తాము వస్తామో రామో ఆ పార్టీ చెప్పలేదు. రామాలయానికి, రాముడికి వ్యతిరేకంగా కేసులు వేసి రాముడి అస్తిత్వాన్నే లేదని వాదించిన కాంగ్రెస్, రామమందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశాలు లేవు. ఇంక ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల సంగతి తెలిసిందే.

దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న అతితక్కువ రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. అక్కడి ప్రభుత్వం ఇప్పుడు రామమందిర ఉద్యమ సమయంలో, అంటే సుమారు 30 ఏళ్ళ నాటి కేసులను తిరగతోడుతోంది. రామభక్తులను వేధించడం మొదలుపెట్టింది. 1992లో అయోధ్య రామమందిర ఉద్యమంలో పాల్గొన్న రామభక్తులను గుర్తించి, వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేసేందుకు కర్ణాటక పోలీసు విభాగంలో ఒక ప్రత్యేక బృందాన్నే ఏర్పాటు చేసారు. అప్పట్లో జరిగిన సంఘటనలకు సంబంధించి కొందరు ‘అనుమానితుల’ జాబితా తయారు చేసారు.

రామమందిర ఉద్యమం సమయంలో ముస్లిములు రెచ్చిపోయి హింసాకాండకు పాల్పడి మతఘర్షణలకు దారి తీసినా, వాటికి హిందువులే కారణమంటూ ఇప్పుడు అరెస్టులు చేసే పని ప్రారంభించారు. 1992 డిసెంబర్ 5న హుబ్బళ్ళిలో మైనారిటీలకు సంబంధించిన ఒక దుకాణాన్ని తగులబెట్టిన సంఘటన జరిగింది. ఆ ఘటనలో శ్రీకాంత్ పూజారి అనే వ్యక్తిని పోలీసులు ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ కేసులో శ్రీకాంత్ పూజారి మూడో ప్రతివాది. ఆయనను కోర్టు పరిశీలనలో ఉంచారు. ఆనాటి కేసులో మరో ఎనిమిది మంది ప్రతివాదులున్నారు. వారందరినీ కస్టడీలోకి తీసుకోడానికి ప్రస్తుత కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అలా హుబ్బళ్ళి పోలీసులు 300 మంది ‘అనుమానితుల’ పేర్లతో ఒక జాబితా రూపొందించారు. వారికి 1992 నుంచి 1996 మధ్యలో జరిగిన మతఘర్షణలతో సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు.

ఆ అనుమానితుల్లో చాలామంది ఇప్పుడసలు హుబ్బళ్ళిలోనే లేరు, ఉన్న కొద్దిమందీ సుమారు 70ఏళ్ళ వయసు వారు. అంతేకాదు, ఆ అనుమానితుల జాబితాలో ఉన్నవారిలో చాలామంది ఇవాళ సమాజంలో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. వారిపై కేసులు పెడితే పర్యవసానాలు ఎలా ఉంటాయోనని పోలీసులు బేరీజు వేసుకుంటున్నారు. ఆ కేసులను విస్తృతంగా విచారించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు విభాగంపై ఒత్తిడి తెస్తోందని సమాచారం.

రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్న వారిలో అత్యధికులు ఇవాళ బీజేపీలో పెద్ద స్థానాల్లో ఉన్న రాజకీయ నాయకులుగా ఎదిగారు. వారిమీద ఉన్న కేసులు దాదాపుగా కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు అవన్నీ తవ్వితీసి వాళ్ళందరినీ మళ్ళీ ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

హిందూ వ్యతిరేక భావజాలంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ పనులను హిందూసంఘాలు తీవ్రంగా ఖండించాయి. అయోధ్య శ్రీరామజన్మభూమిలో రామ్‌లల్లా ఆలయ నిర్మాణం పూర్తయి, దాని ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంలో హిందూసంస్థలు, బీజేపీ ఇంటింటికీ వెళ్ళి నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆ పార్టీ సహించలేకపోతోంది. అందుకే 30 ఏళ్ళనాడు జరిగిన సంఘటనలను తవ్వితీసి వాటిపై ఇప్పుడు దర్యాప్తు చేయించాలని భావిస్తోంది.

ఈ వార్త కర్ణాటక రాష్ట్రంలో పెను సంచలనాన్నే సృష్టించిందని చెప్పాలి. 1990ల్లో కర్ణాటకలో భారీ విధ్వంసం జరిగిన మాట వాస్తవమే. దానికి ప్రధాన కారణం అయోధ్యలో బీజేపీ రామజన్మభూమి ఉద్యమం చేపట్టడానికి వ్యతిరేకిస్తూ హింసాకాండకు పాల్పడడమే. దాన్ని గుర్తించకుండా, ఆనాటి ఉద్యమంలో పాల్గొన్నవారిపై ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతూ కాంగ్రెస్ తన నైజాన్ని మరోసారి బైటపెట్టుకుంది.