News

దేశ సమగ్రతను పరిరక్షించేందుకు దీటుగా ఐఏఎఫ్‌ : ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి

359views

ఎప్పటికప్పుడు కొత్తగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి పిలుపునిచ్చారు. దేశ ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు, శత్రువులను దీటుగా ఎదుర్కొనేందుకు ఐఏఎఫ్‌ కట్టుబడి ఉంటుందని ఆయన నొక్కిచెప్పారు. ఎయిర్‌ ఫోర్స్‌డేను పురస్కరించుకుని ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఐఏఎఫ్‌ అవతరించి 2032 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుందని చెబుతూ ఆయన ప్రపంచంలోనే అత్యుత్తమ వైమానిక దళాల్లో ఒకటిగా ఐఏఎఫ్‌ అవతరించాలని అన్నారు. వ్యూహాలను మెరుగుపరుచుకోవడం, సామర్థ్యాలను సమకూర్చుకోవడం వంటివి భవిష్యత్‌ యుద్ధాల్లో పైచేయి సాధించడంలో ఐఏఎఫ్‌కు ఎంతో కీలకమన్నారు. ఎయిర్‌ ఫోర్స్‌ డే సందర్భంగా ప్రధాని మోదీ యుద్ధ వీరులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి నిరుపమాన సేవలు, త్యాగాల వల్లే మన గగనతలం సురక్షితంగా ఉందని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.