News

నార్వే రచయిత జాన్‌ ఫోసెకు ఈ ఏడాది సాహిత్య నోబెల్‌

401views

ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారాలలో 2023 సంవత్సరానికి గానూ సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. నార్వేకు చెందిన రచయిత జాన్‌ ఫోసెను ఈ ఏడాది సాహిత్య నోబెల్‌ వరించింది. ఆయన తన వినూత్న నాటకాలు, గద్యాలు.. మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు గళంగా మారాయని స్వీడిష్‌ అకాడమీ ఈ సందర్భంగా వెల్లడించింది.

జాన్‌ ఒలావ్‌ ఫోసె 1959లో నార్వేలోని హేగ్‌సండ్‌ ప్రాంతంలో జన్మించారు. ఏడేళ్ల వయసులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. రచయిత మారేందుకు ఆ ఘటనే ఆయనకు స్ఫూర్తిగా నిలిచిందని చెబుతారు. సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆయన లిటరేచర్‌లో పట్టా పొందారు. 1983లో ఆయన ‘రెడ్‌, బ్లాక్‌’ పేరుతో తొలి నవల రాశారు. ఆ తర్వాత అనేక నాటకాలు, చిన్న కథలు, కవిత్వాలు, చిన్నారుల పుస్తకాలను రచించారు.

ముఖ్యంగా తన గద్యాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఫోసె.. తన రచనల్లో ఎక్కువగా మానవ జీవన స్థితిగతులను ప్రస్తావిస్తారు. మన వ్యక్తిగత జీవితాల్లో జరిగే రోజువారీ సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని గద్యాలు, నాటకాలు రాస్తుంటారు.