News

అరవకూరులో గ్రామస్థుల వనవాసం.. తట్టా బుట్టా పట్టుకుని అడవులకు

303views

అనంతపురం జిల్లా కూడేరు మండలం అరవకూరు గ్రామస్థులు తట్ట, బుట్ట పట్టుకుని ఒకరోజు వనవాసానికి గ్రామ శివారులోని అడవులకు వెళ్లారు. రామాయణంలో తండ్రి మాట కోసం శ్రీ రాముడు 12 ఏళ్ల వనవాసానికి వెళ్లిన ఘట్టాన్ని ఆ గ్రామంలోని గ్రామస్థులు ఆచరించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు ఏటా శ్రీరామనవమి వేడుకలు ముగిసిన తర్వాత ఆ గ్రామంలో చిన్నా పెద్దా అంతా కలిసి ఒకరోజు వనవాసానికి వెళ్తారు. ఈ వనవాస ఆచారంలో భాగంగా ఒక రోజంతా స్థానికులు గ్రామ శివారులో ఉన్న అడవిలోని చెట్ల కింద గడుపుతారు. వారంతా అక్కడే వండుకుని భోజనాలు చేస్తారు. ఇలా ఈ ఏడాది కూడా గ్రామంలో ఉన్న మొత్తం రెండు వేల మంది ప్రజలంతా వనవాసం నిమిత్తం గ్రామ శివారులోని పొలాలు, చెట్ల కిందకు వెళ్లారు. గ్రామంలో స్థానికులు వనవాసానికి వెళ్లటం వల్ల గ్రామం అంతా ప్రజలు లేక బోసి పోయింది. అనంతరం రాత్రి ఇంటికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.