News

ధన్‌బాద్‌ IIT-ISM లో ఆరెస్సెస్ యువ సదస్సు

31views

జార్ఖండ్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని ధన్‌బాద్‌లో ఒక భవ్యమైన యువ సదస్సు జరిగింది. ఐఐటీ ఐఎస్ఎమ్ (IIT-ISM) కి చెందిన ప్రతిష్టాత్మక జిజేఎల్టీ (GJLT) ఆడిటోరియంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ, స్వచ్ఛంద, సాంకేతిక మరియు విద్యా సంస్థలకు చెందిన 20 నుండి 35 సంవత్సరాల వయస్సు గల 223 మంది మేధావులైన యువకులు చురుగ్గా పాల్గొన్నారు.

దేశ నిర్మాణంలో యువ శక్తిని భాగస్వామ్యం చేయడం, అలాగే కార్య శతాబ్ది సందర్భంగా సంఘ్ ప్రతిపాదించిన పంచ పరివర్తన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువతతో సంఘ్ గురించి సంభాషించడం అనే లక్ష్యంతో ఈ సదస్సు ఏర్పాటు చేశారు.

సదస్సు ప్రారంభంలో ఐఐటీ ఐఎస్ఎమ్ (IIT-ISM) సీనియర్ ప్రొఫెసర్ ధీరజ్ కుమార్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మరియు రూపరేఖలను ప్రవేశపెట్టారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో యువత యొక్క సానుకూల, నిర్మాణాత్మక భాగస్వామ్యంపై ఆయన ప్రత్యేకంగా నొక్కిచెప్పారు. అనంతరం హాజరైన యువకులు దేశ నిర్మాణం, ప్రపంచ సవాళ్లు మరియు పంచ పరివర్తన్ వంటి వర్తమాన అంశాలపై సంఘ్ సీనియర్ నిర్వాహకులతో నేరుగా మాట్లాడి తమ ఆలోచనాత్మక ప్రశ్నలను అడిగారు.

ప్రాంతీయ సామాజిక సద్భావ సంయోజక్ రాకేశ్ లాల్ ముఖ్య వక్తగా హాజరయ్యారు. సంఘ్ 100 సంవత్సరాల ప్రయాణాన్ని, భవిష్యత్తు భారత పరికల్పనను పంచుకున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన స్థాపన యొక్క 100 సంవత్సరాలను పూర్తి చేసుకుంటోందని, ఈ చారిత్రాత్మక శతాబ్ది సంవత్సరంలో దేశ యువత పాత్ర అత్యంత నిర్ణయాత్మకమైనది మరియు ముఖ్యమైనదని ఆయన అన్నారు.

ఒక బలమైన, సమర్థవంతమైన దేశాన్ని నిర్మించడానికి ఉన్నత విద్య లేదా పుస్తక పరిజ్ఞానం మాత్రమే సరిపోవు. చదువుతో పాటు మనలో ఉన్నత సంస్కారాలు, నైతిక విలువలు మరియు దేశం పట్ల అపారమైన దేశభక్తి ఉండటం కూడా అంతే ముఖ్యం, అప్పుడే మనం నిజమైన అర్థంలో ఆత్మనిర్భర్ మరియు పరమ వైభవశాలి భారత్‌ను నిర్మించగలుగుతాం.”అని వివరించారు.

అంతేకాకుండా పంచ పరివర్తన్ ( సామాజిక సమరసత, పర్యావరణం, కుటుంబ ప్రబోధన్, స్వదేశీ, పౌర విధులు) గురించి సవివరంగా వివరించారు. అలాగే దానికి సరిపోయే ఉదాహరణలను కూడా యువత ముందు వుంచారు.

ఏదో పెద్ద మార్పు కోసం వేచి చూడకుండా యువత తమ స్వంత ఇల్లు, వీధి మరియు కాలనీల నుంచే సామాజిక సంస్కరణలు, పరిశుభ్రత ప్రచారం, నీటి పొదుపు మరియు ప్లాస్టిక్ రహిత జీవితాన్ని ప్రారంభించాలని వక్తలు పిలుపునిచ్చారు. సదస్సు ముగింపులో హాజరైన యువకులు దేశ సేవకు అంకితమవ్వడానికి మరియు ‘వికసిత భారత్’ పరికల్పనను ఆచరణలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తామని సామూహిక సంకల్పం తీసుకున్నారు.