
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్కు బిగ్ షాక్ తగిలింది. కన్నడ సూపర్ హిట్ మూవీ ‘కాంతార’లోని అత్యంత పవిత్రమైన సన్నివేశాన్ని ఎగతాళి చేస్తూ అనుకరించారని, దాంతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలపై బెంగళూరులోని ది హై గ్రౌండ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బెంగళూరుకు చెందిన న్యాయవాది ప్రశాంత్ మేతల్, రణ్వీర్ చర్యలు కోట్లాది మంది హిందువుల, ముఖ్యంగా కర్ణాటకలోని తుళు మాట్లాడే ప్రజల సెంటిమెంట్లను గాయపరిచాయని కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారించిన బెంగళూరులోని అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, పోలీసులకు కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
కాగా, గతేడాది నవంబర్ 28న గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-IFFI ముగింపు వేడుకల్లో రణ్వీర్ సింగ్ పాల్గొన్నారు. ఆ వేదికపై ‘కాంతార’ సినిమాను, రిషబ్ శెట్టి నటనను ప్రశంసించే క్రమంలో రణ్వీర్ ఆ చిత్రంలోని ‘దైవ కోల’ సన్నివేశాన్ని అనుకరించారు. దీంతో తుళు సంస్కృతిని అనుసరించే భక్తులు, హిందూ సంఘాలు రణ్వీర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.




