
251views
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఇష్టపడిన ఓ రష్యన్ జంట వారణాసిలోని దశాశ్వమేధ్ ఘాట్ వద్ద గల నల్వావీర్ బాబా మందిరంలో వేదమంత్రాల సాక్షిగా ఒకటైంది. కాశీలో పెళ్లి చేసుకోవాలని ఇక్కడికి చేరుకున్న వధువు మెరిన్ (36), వరుడు కాన్స్టాంటిన్ (48) పూజారుల సమక్షంలో దండలు మార్చుకొని అగ్నిసాక్షిగా ఏడడుగులు వేశారు. మందిరంలో ఉన్న మహిళలు మంగళకరమైన పాటలు పాడారు. ఈ పెళ్లిలో స్థానికులు కన్యాదానం చేయడం మరో విశేషం. వధూవరులు సంప్రదాయబద్ధంగా లేత గులాబీరంగు చీర.. ధోతీ కుర్తా ధరించి ఆకట్టుకున్నారు. కాశీలో పెళ్లి చేసుకోవాలని అయిదేళ్ల కిందటే ప్రమాణం చేసుకున్నానని, అది నేటికి నెరవేరిందని మెరిన్ సంతోషం వ్యక్తం చేశారు. దశాబ్దకాలంగా కలిసి ఉంటున్న వీరిద్దరూ వ్యాపారవేత్తలు. వీరి వివాహానికి భక్తులే బంధుమిత్రులు కాగా, పురోహితుడు శివకాంత్ పాండే పెళ్లి తంతు జరిపించారు.





