News

చెంచు గిరిజనులకు మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం

206views

వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చి శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయ పాలకమండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెంచు గిరిజనులకు ఉచితంగా స్పర్శ దర్శనం అందించే కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించింది. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేశ్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రత్యేక దర్శనంలో భాగంగా సుమారు 100 మంది చెంచు గిరిజనులు మల్లికార్జునస్వామిని స్పర్శ దర్శనం చేసుకున్నారు.

శ్రీశైల క్షేత్రానికి చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా చెంచు గిరిజనులతో విడదీయరాని అనుబంధం ఉంది. శ్రీశైలం అరణ్య ప్రాంతంలో నివసించే చెంచులు ఆదికాలం నుంచి ఈ క్షేత్రానికి సంరక్షకులుగా, సేవకులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వారి సంప్రదాయాలు, ఆచారాలకు గౌరవంగా ఆలయ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకోవడం భక్తుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ రమేశ్‌నాయుడు మాట్లాడారు. చెంచు గిరిజనులను దృష్టిలో ఉంచుకుని ప్రతి నెలలో ఒకరోజు వారికి ఉచితంగా మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఆలయ మొదటి పాలక మండలి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలో చెంచు గిరిజనులు ఈ అవకాశాన్ని దేవుడి వరంగా భావిస్తూ, దేవస్థానం పాలకులకు కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఇంతకాలంగా ఉన్న కోరిక నెరవేరిందని భావోద్వేగంగా స్పందించారు. శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయంలో చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభం కావడం ఒక చారిత్రక నిర్ణయంగా నిలిచింది. ఇది సంప్రదాయానికి, సమానత్వానికి, గిరిజన సంక్షేమానికి ప్రతీకగా నిలిచింది. భవిష్యత్తులో ఆలయ పాలక మండలి ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.