News

పాక్‌ మతబోధకుడిపై మనీలాండరింగ్‌ కేసు.

291views

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మతబోధకుడు శంసుల్‌ హుదా ఖాన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ సంస్థతో సహా తీవ్రవాద ముఠాలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం శంసుల్‌ యూకేలో నివాసం ఉన్నట్లు వెల్లడించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓ మదర్సాలో శంసుల్‌ 1984లో సహాయ ఉపాధ్యాయుడిగా చేరాడు. 2013లో అతడికి బ్రిటిష్‌ పౌరసత్వం లభించింది. దీంతో విదేశానికి వెళ్లిన అతడు.. మదర్సాలో ఎలాంటి బోధనా విధులు నిర్వర్తించకపోయినా 2013-17 మధ్య జీతం తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత 20ఏళ్లలో అనేక విదేశాల్లో పర్యటించిన శంసుల్‌.. భారత్‌లోని పలు బ్యాంకుల్లో ఖాతాలు కొనసాగించాడని, వాటిని ఉపయోగించే నిధులు అందుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించడంతో పాటు.. మత బోధకుడి ముసుగులో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలూ ఉన్నాయి. అతడు దాదాపు రూ.30 కోట్ల విలువైన స్థిరాస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు.

నిందితుడు తన వ్యక్తిగత ఖాతాలతో పాటు ఓ ఎన్జీవో నుంచి అనేక మదర్సాలకు నిధులు మళ్లించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆజంగఢ్‌, సంత్‌ కబీర్‌ నగర్‌లో రెండు మదర్సాలు స్థాపించాడని కనుగొన్నారు. యూకేలోని తీవ్రవాద సంస్థలతో అతడికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు జరుపుతున్నామని ఈడీ అధికారులు తెలిపారు. శంసుల్‌ పాకిస్థాన్‌ను సందర్శించాడని.. అక్కడి ‘దావత్‌ ఏ ఇస్లామీ’ సంస్థలో సభ్యుడిగా ఉన్నాడని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.