
భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ నిర్వహిస్తున్న భారత సైన్యాన్ని విమర్శిస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తులను అధికారులు సస్పెండ్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. చెంగల్పట్టు జిల్లా కాట్టాన్కొళత్తూర్ సమీపంలోని ఓ ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో లోరా అనే మహిళ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. తాజాగా ఆమె.. సోషల్ మీడియా వేదికగా.. పోస్టులు పెట్టారు. ఆపరేషన్ సిందూర్, భారత సైన్యాన్ని విమర్శిస్తూ వాట్సాప్ స్టేటస్లో పోస్టులు పెట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆమెను సస్పెండ్ చేస్తూ వర్సిటీ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఆమె పోస్టులో.. బుధవారం తెల్లవారుజామున జరిగిన దాడుల్లో భారత్.. పాకిస్తాన్లో ఒక పిల్లవాడిని చంపేసింది. ఇద్దరు వ్యక్తులను గాయపరిచింది. మీ స్వంత రక్తదాహం కోసం, ఎన్నికల విన్యాసాల కోసం అమాయక ప్రాణాలను చంపడం ధైర్యం కాదు.. అది న్యాయం కాదు. ఇది పిరికి చర్య! అని ఆమె తన స్టేటస్లో రాసుకొచ్చారు. లాక్డౌన్లు, ఆహార కొరత వంటి అనిశ్చితుల గురించి కూడా ఆమె హెచ్చరించారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.





