News

వైష్ణోదేవీ మార్గంలో భద్రత కట్టుదిట్టం.. ఇద్దరి అరెస్టు

343views

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీ మాతా వైష్ణోదేవి ట్రెక్కింగ్ మార్గంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పోనీ సర్వీసులు అందిస్తున్న ఇద్దరు వ్యక్తులను రియాసీ జిల్లాలో అధికారులు అరెస్టు చేశారు.

శ్రీ గీతా మాతా మందిర్ వద్ద రెగ్యులర్ గస్తీ తిరుగుతున్న పోలీసు పార్టీ ఒక వ్యక్తిని అనుమానంతో నిలదీసింది. తన పేరు పురాణ్ సింగ్‌గా అతను పరిచయం చేసుకున్నాడు. వెరిఫికేషన్‌లో అతనిని మనీర్ హుస్సేన్‌‌గా గుర్తించారు. వేరే వ్యక్తి గుర్తింపు కార్డుతో అక్రమ సేవలు అందిస్తున్నట్టు గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. కాత్రా పోలీస్ స్టేషన్‌లో అతనిపై కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో మరో ఘటన బాన్ గంగా బ్రిడ్జి వద్ద వెలుగుచూసింది. సరైన లైసెన్స్ లేకుండా పోనీ సేవలు అందిస్తున్న సాహిల్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. సరైన గుర్తింపు లేని విషయాన్ని విచారణలో అంగీకరించడంతో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

పహల్గాం దాడి తర్వాత
హవల్గాం ఉగ్రదాడిలో26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో అధికారులు వైష్ణోమాత ఆలయానికి వెళ్లే మార్గంలో వెరిఫికేషన్‌ ప్రక్రియను మరింత తీవ్రం చేసారు. రిజిస్టర్డ్ సర్వీస్ ప్రొవైడర్లు ఆథరైజ్డ్ డాక్యుమెంట్లు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. యాత్రికులకు ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.