News

కుంభమేళాలో అపచారం..

319views

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళా. హిందూ సాంప్రదాయాలను నమ్మే కోట్ల మంది భక్తులు కుంభమేళాకు హాజరై పవిత్ర స్నానాలను ఆచరిస్తారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతోంది. ఈ మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు. జనవరి 13న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26వ తేదీన ముగుస్తుంది. పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతున్న కుంభమేళా ప్రాంగణంలో భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ప్రవర్తించడాన్ని నిషేధించారు.

కుంభమేళా జరుగుతున్న ప్రాంగణంలో మాంసాహారాన్ని నిషేధించారు. అలాగే మద్యం, సిగరెట్లు వంటి ఉత్పత్తులను కూడా అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కుంభమేళా ప్రాంగణంలో ఓ జంట చికెన్ వండుకుని తినేందుకు ప్రయత్నించింది. ప్రయాగ్‌ రాజ్‌ ప్రాంతంలో టెంట్ వేసుకుని ఉంటున్న ఈ జంట చికెన్ వండుకుని తింటోందని నాగ సాధువులకు తెలిసింది. దీంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆ గుడారం దగ్గరకు వెళ్లి ఆ జంటపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గుడారాన్ని పీకేసి వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు.

ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని జంటపై నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటి పవిత్ర స్థలంలో చికెన్ వండుకుని తినడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇప్పటివరకు కుంభమేళాకు 30 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్టు అంచనా. ఈ కుంభమేళాకు మొత్తం 45 కోట్ల మంది హాజరవుతారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. ప్రధాని మోదీ కూడా బుధవారం ప్రయాగ్‌రాజ్ వెళ్లి పవిత్ర స్నానం ఆచరించారు.