News

బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. సుప్రీంకోర్టు లక్ష్యంగా నిరసనలు

254views

బంగ్లాదేశ్‌లో మరోసారి అల్లర్లు భగ్గుమన్నాయి. బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని నిరసనలు డిమాండ్‌ చేశారు. సీజేఐతోపాటు ఇతర న్యాయమూర్తులు పదవి నుంచి దిగిపోవాలంటూ భారీ ఎత్తున విద్యార్ధులు ఢాకాలోని కోర్టు వద్ద గుమిగూడి నిరసనలు చేశారు. చీఫ్‌ జస్టిస్‌ గంటలో దిగిపోవాలంటూ డిమాండ్లు చేశారు.

వీటికి సీజేఐ అంగీకరించారు. తన పదవికి రాజీనామా చేస్తానని ఒబైదుల్‌ హసన్‌ వెల్లడించారు. కాగా ఒబైదుల్‌ హసన్‌ గత ఏడాదిలోనే బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాకు విధేయుడిగా ఉండేవారు.

అయితే దేశంలో రిజర్వేషన్లపై నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే సీజేఐ కూడా దేశం విడిచి పారిపోవచ్చనే వార్తలతో ఈ నిరసనలు ఒక్కసారిగా చెలరేగాయి.

బంగ్లాలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలు ఇటీవల ఉద్రిక్తంగా మారాయి. గత ఆదివారం మరోసారి హింస చెలరేగి.. 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ సహా పలు దేశాలు తమ పౌరులకు సూచనలు చేశాయి. బంగ్లాదేశ్‌లో ఎవరూ పర్యటించవద్దని హెచ్చరించాయి. మరోవైపు దేశాధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేశారు. తాత్కాలిక పరిపాలన యంత్రాంగానికి యూనస్‌ను సారథిగా నియమితులయ్యారు.