News

మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!

236views

భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. వారు వారం పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉంటారు. వారిద్దరూ బోయింగ్ సంస్థకు చెందిన స్టారైనర్ వ్యోమనౌకలో మే 6న నింగిలోకి పయనం కానున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా ఆ వ్యోమ నౌకలో నిర్వహిస్తున్న మొదటి మానవసహిత యాత్ర ఇది. దీనిలో భాగంగా స్టారైనర్ సామర్థ్యాలను పరిశీలించనున్నారు. ఇది విజయవంతమైతే.. ఐఎస్ ఎస్కి వ్యోమగాములను పంపే మిషన్ల కోసం ఆ వ్యోమనౌకను సర్టిఫై చేసే ప్రక్రియను నాసా ప్రారంభిస్తుంది. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన రెండో మహిళగా సునీతా విలియమ్స్ గుర్తింపు పొందారు. సునీత తొలి పర్యటన.. 2006 డిసెంబరు నుంచి 2007 జూన్ వరకు సాగింది. నాడు మొత్తం నాలుగు విడతల్లో 29 గంటల 17 నిమిషాల పాటు స్పేస్వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు సృష్టించారు. తర్వాత 2012లో నాలుగు నెలల పాటు ఐఎస్ఎస్లో విధులు నిర్వర్తించారు.