News

ఓటింగ్ లేదు కౌంటింగ్ లేదు..ఎన్నికలకు ముందే 10 అసెంబ్లీ సీట్లు గెల్చుకున్న బీజేపీ

289views

ఇటివల కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగకుండానే బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూతో సహా మొత్తం 10 మంది బీజేపీ అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ సహా 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం.

ముక్తో అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఖండూపై అభ్యర్థి ఎవరూ కూడా పోటీ చేయలేదు. మరోవైపు సాగలి అసెంబ్లీ స్థానానికి టెక్కీ రోటు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఖండూ 10 మంది అసెంబ్లీ అభ్యర్థుల విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ వారితో కలిసి సంబరాలు చేసుకున్నారు. దీంతోపాటు మోదీకి ప్రజలపై ఉన్న ప్రేమ వల్లే ఇదంతా జరిగిందని వెల్లడించారు.

మరోవైపు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్‌లోని రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు అసెంబ్లీలోని 60కి 60 సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని అన్నారు. ఇక 60 స్థానాలున్న అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లోని ఇతర నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి.