
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఓ గర్భిణీ, శివస్తోత్రాల ఆలాపన మధ్య ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ థియేటర్ లో గర్భిణీ తరఫు బంధువు శివస్తోత్రాలు ఆలపిస్తుండగా ప్రసవం జరిగిది. వైద్యుల సమ్మతితో పాటు సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉజ్జయినిలోని మంచామన్ కాలనీకి చెందిన ఉపాసన దీక్షిత్కు మార్చి 27న ప్రసవనొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఉపాసన ఆందోళనకు గురయ్యారు. ఈ సమయంలో తన అత్త అయిన ప్రీతి దీక్షిత్ ను కూడా లేబర్ రూమ్ లోకి అనుమతించాలని గర్భిణీ కోరింది. వైద్యులు ఆమెను అనుమతించారు. అలాగే గర్భిణీ కోరిక మేరకు ఆమె అత్త ప్రీతి దీక్షిత్ శివభజన చేసేందుకు అనుమతించారు.
ప్రీతి దీక్షిత్ శివస్తోత్రాలు ఆలపిస్తుండగా వైద్యులు ఆపరేషన్ నిర్వహించి ప్రసవం చేశారు. 20 నిమిషాల వ్యవధిలో ఉపాసన మగబిడ్డకు జన్మనిచ్చింది. థియేటర్లో ప్రీతి భజనలు చేస్తున్న వీడియోను వైద్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. ప్రీతి తన భజనలతో సానుకూల వాతావరణం కల్పించారని డాక్టర్ జయ మిశ్రా తెలిపారు.



