News

రామ్‌లల్లా ప్రతిష్ట తరువాత తొలిసారి హోలీ.. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

357views

అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగిన తరువాత తొలిసారి హోలీ పండుగ వేడుకలు ఘనంగా అవుతున్నాయి. భక్తులు ఆదివారం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదే తొలి రంగుల పండుగ కావడంతో అయోధ్య పట్టణమంతా రంగులమయంగా మారింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం రామలల్లా విగ్రహం, రామాలయంలోని భక్తుల చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రామ్ లల్లా విగ్రహానికి గులాల్ పూశారు.

భక్తులు స్వామివారికి ధూపదీప నైవేధ్యాలు సమర్పించారు. పవిత్రమైన రోజు కావడంతో రాముడి దర్శనం కోసం ఆలయంలో భక్తులు పోటెత్తారు. దేశవ్యాప్తంగా మార్చి 24, 25 తేదీల్లో ప్రజలు హోలీ పండుగ జరుపుకోనున్నారు.

రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ.. “ఈసారి హోలీని గ్రాండ్‌గా, దివ్యంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాం. ఈ ఏడాది హోలీ అద్భుతంగా ఉంటుంది.

రామ్‌లల్లాకు గులాల్ పూస్తాం. గుజియా, హల్వా వంటి ప్రీతిపాత్రమైన ఆహార పదార్థాలను నైవేధ్యం సమర్పిస్తాం. పండుగ సమయం కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు” అని అన్నారు.