News

‘భోజ్‌శాల’ కాంప్లెక్సులో ఆర్కియాలజీ సర్వే

360views

హైకోర్టు ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్‌ ధార్‌లోని భోజ్‌శాల కాంప్లెక్సులో ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ సర్వే ప్రారంభమైంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య డజను మంది ఆర్కియాలజీ సిబ్బంది, ధార్‌ జిల్లా అధికారులు సర్వే మొదలు పెట్టారు. సర్వే జరుగుతుండగా ఆ ప్రాంతంలో పోలీసులు భద్రతా డ్రిల్‌ చేపట్టారు.

‘2022 మేలో మేం ఆర్కియాలజీ సర్వే కోసం కోర్టులో పిటిషన్‌ వేశాం. కార్బన్‌ డేటింగ్‌ సహా పూర్తిస్థాయి టెక్నాలజీ వాడి సర్వే చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో సర్వే మొదలైంది. ఆరు వారాల తర్వాత సర్వే నివేదిక వస్తుంది’ అని భోజ్‌శాల సర్వే కోసం పిటిషన్‌ వేసిన హిందూ ఫ్రంట్‌ ఫర్‌ జస్టిస్‌ ఆశిశ్‌ గోయెల్‌ చెప్పారు.

కాగా, మార్చి 11న భోపాల్‌ హైకోర్టు భోజ్‌శాలలో సర్వే నిర్వహించాలని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించింది. మధ్య యుగానికి సంబంధించిన భోజ్‌శాల కాంప్లెక్స్‌ సరస్వతీ దేవీ ఆలయమని హిందువులు, కమల్‌ మౌలా మసీదు అని ముస్లింలు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాంప్లెక్సులో ప్రతి మంగళవారం హిందువులు పూజలు చేస్తుండగా శుక్రవారం ముస్లింలు నమాజ్‌ చేస్తున్నారు.