News

పునర్వినియోగ లాంఛర్‌ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో

253views

అంతరిక్షరంగంలో దూసుకెళుతోన్న ఇస్రో మరో మైలురాయిని చేరుకుంది. పునర్వినియోగ ల్యాండర్ పుష్పక్‌ను కర్ణాటకలోని ఓ రన్‌వేపై విజయవంతంగా దించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు.

ముందుగా పుష్పక్ రాకెట్‌ను ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ నుంచి జారవిడిచారు. అది విజయవంతంగా ల్యాండ్ అయినట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు. పుష్పక్ రాకెట్ విజయవంతంగా రన్‌వేపై దిగడంతో మిషన్ విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. అంతరిక్షం నుంచి రాకెట్‌ను మరలా భూమిపై దించడం పుష్పక్ ద్వారా సాధ్యం కానుంది. అది కూడా దేశీయంగా రూపొందించిన పుష్పక్ ద్వారా ఇస్రో ఈ ఘనత సాధించింది.

ముందుగా పుష్పక్ రాకెట్‌ను చినాక్ హెలికాఫ్టర్ ద్వారా 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలేశారు. అది రన్‌వేకు 4 కి.మీ దూరంలో ఉంది.పుష్పక్ స్వయంగా రన్‌వేపై విజయవంతంగా దిగింది. అత్యధిక వేగాన్ని నియంత్రించుకునేందుకు బ్రేక్ ప్యారాచూట్‌ను కూడా పుష్పక్ ఉపయోగించుకుంది.

పుష్పక్‌ను రూపొందించేందుకు వందలాది శాస్త్రవేత్తలు పది సంవత్సరాలుపైగా కృషి చేశారు. 6.5 మీటర్ల పొడవు. 1.75 టన్నుల బరువుండే పుష్పక్‌ను దేశీయంగా తయారు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.100 కోట్లు ఖర్చు చేసింది. భవిష్యత్‌లో అంతరిక్షంలోకి మానవులను పంపిన తరవాత వారిని సురక్షితంగా భూమిపైకి తిరిగి తీసుకురావడంలో పుష్పక్ ఉపయోగపడనుంది.