News

కీలక ప్రయోగానికి సిద్ధమైన నాసా, చంద్రుడిపైకి ప్రైవేటు ల్యాండర్

365views

మరోసారి మానవ సహిత జాబిల్లి యాత్ర ప్రయత్నాల్లో భాగంగా చంద్రుడి పై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం నాసా శ్రమిస్తోంది. ఇటీవల ఓ ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో చేపట్టిన ల్యాండర్ ప్రయోగం విఫలం కాగా, మరో లూనార్ ల్యాండర్ ను తాజాగా చంద్రుడిపైకి ప్రయోగించింది. హ్యూస్టన్ కు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన ల్యాండర్ ను నాసా, బుధవారం అర్ధరాత్రి తర్వాత నింగిలోకి ప్రయోగించింది.

నాసాకు చెందిన కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కర్ రాకెట్ దీనిని మోసుకెళ్ళింది. అన్నీ అనుకూలిస్తే ఫిబ్రవరి 22న చంద్రుడి దక్షిణ ద్రువంపై ఈ ప్రైవేటు ల్యాండర్ దిగనుంది. చంద్రుడి ఉపరితలంపై పరిస్థితులు అధ్యయనం చేసి ఆ సమాచారాన్ని నాసాకు పంపించడం దీని లక్ష్యం. నాసా చేపట్టమబోయే ఆర్టెమిస్ యాత్రకు ఈ ప్రయోగం విజయం సాధించడం చాలా ముఖ్యం. దీనికంటే ముందు ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్ ప్రైవేటు సంస్థ రూపొందించిన పెరీగ్రాన్ ల్యాండర్ ను గత నెలలో ప్రయోగించగా విఫలమైంది.

1969 లో నాసా చేపట్టిన అపోలో ప్రయోగం విజయవంతం కావడంతో జాబిల్లిపై అగ్రదేశం అడుగుపెట్టింది. ఆ తర్వాత 1972 వరకు ఆరుసార్లు మానవసహిత జాబిల్లి యాత్రలు చేపట్టింది. ఇప్పటి వరకు అమెరికా, భారత్, జపాన్, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యాయి. ప్రైవేటు కంపెనీలు మాత్రం ఈ ఘనత సాధించలేకపోయాయి. దీంతో తొలిసారి ఈ ఘనత సాధించాలని హ్యూస్టన్ కంపెనీ ఈ ప్రయోగం చేపట్టింది.