News

పశ్చిమబెంగాల్‌లో హిందూ మహిళలపై టీఎంసీ గూండాల అత్యాచారాలు

322views

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో హిందూ మహిళలపై టీఎంసీ గూండాల అత్యాచారాలు సమాజాన్ని దిగ్భ్రాంతులను చేసాయి. ఆ సంఘటనలు విచిత్రంగా బైటపడ్డాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానూ సమర్ధించుకోలేని పరిస్థితిలో చిక్కుకుపోయింది. కొద్దివారాల్లో పార్లమెంటు సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంటే, ఇప్పుడు ఏం జరుగుతోంది? సందేశ్ ‌ఖాలీ లో ఏ సమయానికి ఏ సంఘటన చోటు చేసుకుందో ఒక్కసారి పరిశీలిద్దాం.

2024 జనవరి 5న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు, ఒక రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ అనే గ్రామానికి వెళ్ళారు. ఆ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షేక్ షాజహాన్ కీలక పాత్రధారి. ఈడీ అధికారులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, సమన్లు జారీ చేసినా వాడు స్పందించలేదు. దాంతో ఈడీ అధికారులు, సీఆర్‌పీఎఫ్ జవాన్లు కలిసి ఆ గ్రామానికి వెళ్ళారు. వారి మీద సుమారు 3వందల మంది గ్రామస్తులు గుంపుగా దాడి చేసారు. ఆ రోజు ఘటన తర్వాత షేక్ షాజహాన్ తప్పించుకుని పారిపోయాడు. అయితే అతని అకృత్యాలు ఒక్కొక్కటిగా బైటపడ్డాయి.

2024 ఫిబ్రవరి 8న సందేశ్‌ఖాలీ గ్రామానికి చెందిన మహిళలు వీధుల్లోకి వచ్చి, నిరసన ప్రదర్శన చేపట్టారు. షేక్ షాజహాన్, అతని అనుచరులైన శివప్రసాద్ (సిబూ హజ్రా), ఉత్తమ్ సర్దార్‌ల దుర్మార్గాలకు అంతూ పొంతూ లేదంటూ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. వందల సంఖ్యలో మహిళలు చీపుళ్ళు, చేటలు, కర్రలు చేతపట్టుకుని రహదారులపైకి వచ్చారు. రహదారులను దిగ్బంధించారు. తృణమూల్ గూండా గ్యాంగులు మహిళలను ఎత్తుకుపోయి, వారిని మానభంగాలు చేస్తున్నారు. ఆ దుర్మార్గాలకు పార్టీ కార్యాలయమే వేదిక. ప్రత్యేకించి హిందూ మహిళలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. వారిని ఎత్తుకుపోయి పార్టీ కార్యాలయంలో సామూహిక మానభంగాలు చేస్తున్నారు.

2024 ఫిబ్రవరి 9, 10 తేదీల్లో మహిళలు ఒక కోళ్ళఫారంపై దాడి చేసారు. గ్రామస్తుల నుంచి బలవంతంగా లాక్కుని ఆక్రమించిన భూమిలో ఆ ఫారం కట్టారు. ఆ పని చేసింది షేక్ షాజహాన్ సన్నిహిత మిత్రుడు, టీఎంసీ స్థానిక నాయకుడూ అయిన శిబు హజ్రా. ఆ కోళ్ళ ఫారాన్ని అడ్డం పెట్టుకుని పలు అశ్లీల అసభ్య చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అందుకే గ్రామ మహిళలు ఆ కోళ్ళఫారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

2024 ఫిబ్రవరి 10న సందేశ్‌ఖాలీ గ్రామ మహిళల నిరసన దీక్ష తారస్థాయికి చేరుకుంది. వారి ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో హింసాకాండ చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులు ఆ ప్రాంతమంతటా సెక్షన్ 144 విధించారు. ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి. స్థానిక కేబుల్ ఆపరేటర్లను కూడా సంప్రదించి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.

2024 ఫిబ్రవరి 12న సందేశ్‌ఖాలీ గ్రామ నివాసులు తమకు న్యాయం చేయాలంటూ బెంగాల్ గవర్నర్ సివి ఆనందబోస్‌ను కోరారు. అదే సరైన సమయమని భావించిన మహిళలు, తృణమూల్ గూండాలకు కఠినమైన శిక్షలు వేయాలని డిమాండ్ చేసారు.

నిరసన కార్యక్రమాలు కొనసాగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌పై నిషేధాన్ని కొనసాగించింది. పక్కనే ఉన్న హింగల్‌గంజ్ ప్రాంతానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఈడీ బృందం మీద దాడి జరిగి అప్పటికి నెల రోజులైంది.

మరోవైపు టీఎంసీ గూండాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్న పోలీసులు, మహిళలపై లైంగిక హింసాకాండ మీద దర్యాప్తు మొదలుపెట్టారు. 10మంది సభ్యులతో ఒక కమిటీని బెంగాల్ పోలీసులు ఏర్పాటు చేసారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా, సందేశ్‌ఖాలీ గ్రామంలో షేక్ షాజహాన్, అతని గూండాల అరాచకాల మీద రాష్ట్ర మహిళా కమిషన్ ఒక నివేదిక సమర్పించిందని ప్రకటించారు. ఆ నివేదికలోని అంశాల ఆధారంగా దోషుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఆ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ‘‘హిందువుల ఊచకోతకు మమతా బెనర్జీ ప్రసిద్ధురాలు. ఆమె మనుషులు పెళ్ళయిన హిందూ మహిళలను ఎంపిక చేసి ఏరతారు. వారిని ఎత్తుకుపోయి తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలో రేప్ చేస్తారు. బెంగాలీ హిందూ మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్న వారి నాయకుడు ఎవరు? సందేశ్‌ఖాలీ మహిళలు ఆరోపణలు చేస్తున్న షేక్ షాజహాన్ ఎవరు? అని ఈరోజు వరకూ అడిగారు. కానీ ఇకపై మమతా బెనర్జీని అడగాల్సిన ప్రశ్న, షేక్ షాజహాన్ ‘‘ఎవరు?’’ అంటూ స్మృతీ ఇరానీ విరుచుకునిపడ్డారు.

2024 ఫిబ్రవరి 13న ఈ కేసు విషయంలో కలకత్తా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టులోని ఏక జడ్జి బెంచ్ కేసును సుమోటోగా తీసుకుంది. ఉత్తర పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీ గ్రామంలో తాజా ఘటనలు అన్నింటినీ స్వయంగా గుర్తించి వాటిపై విచారణ జరగాలని ఆదేశించింది.

అదే సమయంలో, సందేశ్‌ఖాలీ గ్రామంలో సెక్షన్ 144 విధిస్తూ జారీ చేసిన ఆదేశాలను జస్టిస్ జే సేన్‌గుప్తా నేతృత్వంలోని సింగిల్ బెంచ్ న్యాయమూర్తి కొట్టేసారు.

నిజానికి మూడేళ్ళ క్రితం అంటే 2021లోనే సందేశ్‌ఖాలీ గ్రామ మహిళలు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఒక సామూహిక అర్జీ పెట్టుకున్నారు. తమ గ్రామంలోని మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, మానభంగాలు, హింసాకాండలు అన్నింటినీ ఒక జాబితా తయారుచేసి దాన్ని మమతా బెనర్జీకి పంపించారు. అయినప్పటికీ గత మూడేళ్ళలో ఆ ప్రాంతం పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు.

ఇప్పుడు బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ ఈ పరిణామాలపై కేంద్రానికి తన నివేదిక సమర్పించాలి. అందుకోసం ఢిల్లీ చేరుకున్న ఆనందబోస్ కాన్వాయ్‌లోని వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టడం కాకతాళీయం అనుకోవాలా? ఆ దాడికి పాల్పడింది ఎవరన్న సంగతి త్వరలోనే తెలుస్తుంది. ఆనందబోస్ నివేదికలోని వివరాలు బైటపడితే ఎవరెవరికి ఎలాంటి అన్యాయాలు జరిగాయో తెలుస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని రౌడీలు, గూండాల పార్టీ అని ఎందుకంటారో అర్ధమవుతుంది.