
భారత సనాతన ధర్మానికి విదేశాల్లోనూ విశేష ఆదరణ లభిస్తుందని భువనేశ్వరీ పీఠాధిపతి కమలానంద భారతి స్వామి అన్నారు. సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాడుగులలో హిందూ ధర్మ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి భవనేశ్వరీ పీఠం పీఠాధిపతి కమలానంద భారతీ స్వామి హాజరై మాట్లాడారు. గృహాశ్రమం కలిగిన ధర్మశాస్త్రం ఆచరిస్తున్న జాతి హిందూ జాతి అన్నారు. రామాయణం, మహాభారతం ప్రవచనాలు చేసి సనాతన సంప్రదాయాల విశిష్టతను వివరించారు. భారత సంస్కృతీ సంప్రదాయాలు గొప్పదనాన్ని మరువొద్దన్నారు. భారత సనాతన సంప్రదాయాన్ని పాశ్చాత్య దేశాల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి వివేకానందుడని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అంతకు ముందు కమలానంద భారతి స్వామిని సమరసతా సేవా ఫౌండేషన్ సభ్యులు ఊరేగింపుగా సభ వద్దకు తీసుకు వచ్చారు. కార్యక్రమంలో నన్నయ్య యూనివర్సిటీ పూర్వ వైస్ చాన్సలర్ ముర్రు ముత్యాలనాయుడు, ఉత్తరాంధ్ర ధర్మప్రచారక్ ఆడారి గంగాధర్, జిల్లా సంస్కృతి ప్రముఖ్ చుచ్చకర్ల నాగేశ్వరరావు, మండల ధర్మ ప్రచారక్ తవ్వా సన్యాసిశెట్టి, భక్తులు పాల్గొన్నారు.




