News

కొండ గుహలో యోగి ఆదిత్యనాథ్

439views

డెహ్రాడున్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్నారు. ఇది ఆయన సొంత రాష్ట్రం. మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు. కేంద్ర ప్రాంతీయ మండలి సమావేశంల పాల్గొనడానికి ఉత్తరాఖండ్‌కు వచ్చారాయన. శనివారం సాయంత్రం ఆయన డెహ్రాడున్‌కు చేరుకున్నారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, మంత్రులు స్వాగతం పలికారు. ఆ వెంటనే ఆయన బద్రినాథ్ ఆలయాన్ని సందర్శించారు. బద్రీనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి ఆలయంలో నిర్వహించిన శయన హారతిలో పాల్గొన్నారు. భారత్ చిట్టచివరి గ్రామం మానాను కూడా సందర్శించారు. ఘస్తౌలీ పోస్ట్‌కు వెళ్లారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఇండో-టిబెట్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ సిబ్బందిని కలుసుకున్నారు.

సముద్ర మట్టం నుంచి 13,200 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఘస్తౌలీ పోస్ట్. చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఇది ఏర్పాటైంది. ఘస్తౌలీ సమీపంలో గల అలకనంద నదిని సందర్శించారు యోగి. నదీమతల్లికి ప్రత్యేక పూజలు చేశారు. బద్రీనాథ్ ధామ్‌లో నిర్మాణంలో ఉన్న ఉత్తరప్రదేశ్ స్టేట్ గెస్ట్ హౌస్‌ను పరిశీలించారు. రాత్రి బద్రినాథ్ ధామ్‌లో బస చేశారు.
ఈ తెల్లవారు జామున యోగి ఆదిత్యనాథ్ చార్ ధామ్ ఆలయాల సందర్శనను ప్రారంభించారు. బద్రినాథ్ ధామ్ సమీపంలోని సుందర్ నాథ్ కేవ్ ఆలయానికి వెళ్లారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో యోగి ఆదిత్యనాథ్.. ఓ సాధారణ భక్తుడిలా కనిపించారు. ఆయన వెంట వ్యక్తిగత భద్రత సిబ్బంది, ఇతర అధికారులు ఎవరూ లేరు. అనంతరం బద్రినాథ్ ధామ్‌లో స్థానికులను కలుసుకున్నారు.