News

రామమందిర నిర్మాణానికి రూ.900కోట్ల ఖర్చు!.. 5లక్షల గ్రామాల్లో రాముని అక్షతలు పంపిణీ.. 10లక్షల మందికి..

442views

Ayodhya Ram Mandir Budget: ఉత్తర్ప్రదేశ్.. అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి 2023 మార్చి వరకు రూ.900 కోట్లు ఖర్చు చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 2023 మార్చి 31వ తేదీ వరకు ఈ భారీ వ్యయం జరిగినట్లు తెలిపింది. ఇంకా రూ.3000 కోట్లు.. ట్రస్ట్ బ్యాంకు ఖాతాలో ఉన్నట్లు తెలిపింది.

Ayodhya Ram Mandir Opening: ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే రామమందిర ట్రస్ట్ సమావేశం.. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ నివాసంలో శనివారం జరిగింది. మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో రామ్ లల్లా ప్రతిష్ఠా మహోత్సవాల నిర్వహణపై ప్రధానంగా చర్చించారు. ఆలయ నిర్మాణానికి వెచ్చించిన డబ్బుకు సంబంధించిన వివరాలు సహా 18 అంశాలపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు చర్చించుకున్నారు. సమావేశం అనంతరం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వివరాలను వెల్లడించారు. ఆలయ నిర్మాణ పనులు మూడు దశల్లో జరుగుతున్నాయని తెలిపారు. మొదటి దశ 2024 జనవరి నాటికి, రెండో దశ 2024 డిసెంబర్ నాటికి, మూడో దశ 2025 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని ప్రకటించారు. సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కథా మ్యూజియం లీగల్ ట్రస్ట్‌గా ఉంటుందని.. రామమందిరానికి సంబంధించిన 50 ఏళ్ల చట్టపరమైన పత్రాలు అందులో భద్రపరుస్తామని చెప్పారు.

Ayodhya Ram Mandir Inauguration Date: జనవరి 22న జరగనున్న రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 10,000 మంది ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. పవిత్రోత్సవం రోజున సూర్యాస్తమయం తర్వాత తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని దేశవ్యాప్తంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందు రాముడికి పూజించిన అక్షతలను దేశమంతటా పంపిణీ చేస్తామని చెప్పారు.

ఐదు లక్షల గ్రామాలకు రాముని అక్షతలు
2024 జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఐదు లక్షల గ్రామాల్లో ‘పూజిత్ అక్షత్’పేరుతో అక్షతలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి సంబంధించి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత దర్శనానికి వచ్చే ప్రతి రామభక్తునికి రామ్‌ లల్లా చిత్రపటాన్ని అందజేస్తామని తెలిపారు. 10 కోట్ల మంది ప్రజల ఇళ్లకు రామ్‌లల్లా ఫొటోను అందజేయడమే ట్రస్టు లక్ష్యమని చెప్పారు.