
భారత దేశం (India) ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశంగా రికార్డు సృష్టించింది. జనాభా విషయంలో చైనాను వెనుకకు నెట్టింది. చైనా (China) జనాభా 142.57 కోట్లు కాగా, భారత దేశ జనాభా 142.86 కోట్లు. ఐక్యరాజ్య సమితి (United Nations) బుధవారం విడుదల చేసిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. వివిధ దేశాల జనాభా సమాచారాన్ని ఐక్య రాజ్య సమితి 1950 నుంచి సేకరిస్తోంది. అత్యధిక జనాభాగల దేశాల జాబితాలో ప్రథమ స్థానంలో భారత దేశం నిలవడం ఇదే మొదటిసారి.
చైనా జనాభా 1960 తర్వాత మొదటిసారి గత ఏడాది తగ్గింది. 1960లో అప్పటి మావో జెడాంగ్ ప్రభుత్వ వ్యవసాయ విధానాల వల్ల విపత్తు సంభవించింది. ఫలితంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భవిష్యత్తులో కూడా చైనా జనాభా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. జననాల రేటు తగ్గడం, ప్రస్తుత ఉద్యోగ, కార్మిక వర్గంలో అధిక వయసుగలవారు ఉండటం వంటి కారణాల వల్ల జనాభా తగ్గవచ్చు. జననాల రేటును పెంచేందుకు చైనాలోని వివిధ రాష్ట్రాలు ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. అయినప్పటికీ సత్ఫలితాలు రావడం లేదు.
ఇదిలావుండగా, భారత దేశంలో 2011 నుంచి జనాభా లెక్కల సేకరణ జరగలేదు. దేశ జనాభా గురించి అధికారిక లెక్కలు లేవు. దశాబ్దానికి ఒకసారి జనాభా లెక్కలను సేకరించవలసి ఉంది. షెడ్యూలు ప్రకారం 2021లో జనాభా లెక్కల సేకరణ జరగవలసి ఉన్నప్పటికీ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడింది.




