
జైపూర్: రాజస్థాన్లో విదేశీ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆగస్టు 21న ఈడీ జైపూర్ ప్రాంతీయ కార్యాలయ అధికారులు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA), 1999 కింద పాస్టర్ రవి మోహన్ పహారియా నివాసంలో సోదాలు నిర్వహించారు. విదేశీ నిధులను నిబంధనలకు విరుద్ధంగా స్వీకరించి, మతమార్పిడి కార్యకలాపాలకు వినియోగిస్తున్నారన్న సమాచారంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఈడీ దర్యాప్తు ప్రకారం.. పహారియా, ఆయన భార్య గుంజన్ శర్మ విదేశాల నుంచి భారీగా నిధులు స్వీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమెరికాకు చెందిన దాతల నుంచి వచ్చిన నిధుల్లో గణనీయమైన మొత్తాన్ని ఎఫ్సీఆర్ఏ నిబంధనలకు విరుద్ధంగా స్వీకరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వ్యాపారం, కన్సల్టెన్సీ సేవల కోసం నిధులు అందినట్లు చూపించినప్పటికీ.. వాటిని ఇతర ప్రయోజనాలకు మళ్లించినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
జైపూర్లోని వాల్మీకి వర్గంతో పాటు దక్షిణ రాజస్థాన్లోని భిల్ గిరిజనులు అధికంగా నివసించే ప్రాంతాల్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. విదేశీయులతో పహారియాకు నిరంతర సంబంధాలు ఉన్నాయని, వారి సూచనల మేరకు వివిధ ప్రాంతాల్లో సమావేశాలు, మతపరమైన సభలు నిర్వహించినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించినట్లు సమాచారం.
సోదాల సమయంలో పలు కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎఫ్సీఆర్ఏ అనుమతులు లేకుండానే సుమారు రూ.2.88 కోట్ల విదేశీ నిధులు పొందినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధుల్లో కొంత మొత్తాన్ని వ్యక్తిగత ఖర్చులు, విదేశీ ప్రయాణాలు, ఆస్తుల కొనుగోలుకు వినియోగించినట్లు ఈడీ అనుమానిస్తోంది.
విదేశీ నిధుల మూలం, వాటి వినియోగం, సంబంధిత వ్యక్తులు, సంస్థల పాత్రపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కేసులో మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.





