
వందేమాతం’లోని తొలి రెండు చరణాలను మాత్రమే పాడతామని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ గేయం గౌరవం విషయంలో ఎటువంటి రాజీకీ అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. వందేమాతరం ఘన వారసత్వాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేందుకు ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. బిజెపి అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన తొలిసారి సమావేశమైన నూతన జాతీయ కార్యవర్గం ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఆమోదించింది.
‘‘వందేమాతరం గౌరవం, చారిత్రక వారసత్వం పరిరక్షణకు సంబంధించి ముఖ్యమైన తీర్మానాన్ని ఆమోదించాం. ఈ గేయం విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నాం. ఆరు చరణాలతో కూడిన పూర్తి వందేమాతరం చరిత్ర, అర్థం, జాతీయ ప్రాముఖ్యాన్ని ప్రచార కార్యక్రమాల ద్వారా యువతకు వివరిస్తాం. ‘పూర్ణ వందేమాతరం’ గౌరవాన్ని కాపాడతాం. వందేమాతరాన్ని సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదంగా పేర్కొన్న మహాత్మ గాంధీ ప్రకటననూ ప్రచారం చేస్తాం’’ అని నితిన్ నబీన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.





