
మదురైలోని తిరుప్పరం కుండ్రం కొండపై సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద కార్తీక దీపం వెలిగించడానికి అనుమతించిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్పై కులమతపరంగా దుర్భాషలాడిన నిరసనకారులపై చర్యలు తీసుకోవాలంటున్న పిటిషన్పై తమిళనాడు ప్రభుత్వ సమాధానాన్ని సుప్రీంకోర్టు కోరింది. సుప్రీం ద్విసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికీ, పోలీసు డైరెక్టర్ జనరల్, చెన్నై పోలీసు కమిషనర్లకు నోటీసులు జారీచేసింది. తిరుప్పరం కుండ్రం ఆలయం ఎదురుగా ఉన్న దీపస్తంభంపై భక్తులు కార్తీక దీపం వెలిగించవచ్చని, దీపస్తంభానికి దర్గా 50 మీటర్ల దూరంలో ఉంది కాబట్టి దీపం వెలిగించడానికి ఆక్షేపణ లేదని జస్టిస్ స్వామినాథన్ నిరుడు డిసెంబరు 1న తీర్పు చెప్పారు. తన ఉత్తర్వు అమలు కాకపోవడంతో కేంద్ర బలగం సీఐఎస్ఎఫ్ అండతో భక్తులు దీపం వెలిగించవచ్చని డిసెంబరు 3న ఉత్తర్వు జారీచేశారు. దీన్ని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.





