News

పెనుకొండలో వెలుగు చూసిన వైష్ణవాలయం

279views

శ్రీసత్యసాయి జిల్లాలో   పురాతన కట్టడాలకు ఆలవాలమైన  పెనుకొండ కోటపై  అద్భుతమైన ఆలయం బయటపడింది. వీరణ్ణ కొండ ప్రాంతంలో ఇస్కాన్‌ బేస్‌క్యాంప్‌ నిమిత్తం ఎంపిక చేసిన స్థలాన్ని పురావస్తు శాఖ డీడీ సురేష్‌ పరిశీలిస్తుండగా అక్కడికి సమీపంలోనే మరో పురాతన ఆలయాన్ని గుర్తించినట్లు ఆ శాఖ ఏడీ స్వామి నాయక్‌ తెలిపారు. ఆలయ నిర్మాణం వైష్ణవ సంప్రదాయాన్ని పోలి ఉండడంతో అది వైష్ణవాలయంగా ప్రాథమికంగా నిర్ధారించారు. గుప్త నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు సాగించినట్లుగా అక్కడి ఆనవాళ్లు స్పష్టం చేస్తున్నాయన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారి వెంట తహసీల్దార్‌ స్వాతి ఉన్నారు.

గగన్‌మహల్‌ సంరక్షణకు చర్యలు

గగన్‌హల్‌ సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నట్లు విజయవాడలోని పురావస్తు శాఖ డీడీ సురేష్‌ తెలిపారు. ఆయనతో పాటు ఏడీ స్వామినాయక్‌ మంగళవారం గగన్‌మహల్‌ను పరిశీలించారు. సురేష్‌ మాట్లాడుతూ.. గగన్‌మహల్‌ ఆధునీకీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతకు ముందు ఆయన కొండపై శిథిలావస్థలో వున్న లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని, వీరణ్ణ కొండ ప్రాంతంలో రూ.450 కోట్లతో నిర్మించే ఇస్కాన్‌ బేస్‌ క్యాంప్‌ స్థలాన్ని తహసీల్దార్‌ స్వాతి, సర్వేయర్‌తో కలసి పరిశీలించారు.