
రాజస్థాన్లోని అజ్మేర్లో ఓ స్పానిష్ జంట వేదమంత్రాల సాక్షిగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. స్పెయిన్కు చెందిన కలేరా, రావుల్ గత ఏడేళ్లుగా ప్రేమలో ఉండి సహజీవనం చేస్తున్నారు. రావుల్కు పని ఒత్తిళ్ల కారణంగా ఇంతకాలం వివాహం చేసుకోలేకపోయామని కలేరా తెలిపింది. ఒకరినొకరు మరింతగా తెలుసుకోవాలని భారత పర్యటనకు వచ్చినట్లు పేర్కొంది. అజ్మేర్ పక్కనున్న ఆధ్యాత్మిక నగరి పుష్కర్కు చేరుకొని ఇక్కడే హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పుష్కర్ సరస్సులోని కృష్ణ ఘాట్ వద్ద పండితుల వేదమంత్రాల మధ్య సప్తపదితో వీరి వివాహ కార్యక్రమం ఘనంగా జరిగింది. భారతీయ సంప్రదాయ వస్త్రాలు ధరించిన కలెరా నుదుటిపై రావుల్ సిందూరం దిద్ది ఆమెను భార్యగా స్వీకరించారు. ఇద్దరూ దండలు మార్చుకొన్నారు. ఈ జంట మహాదేవునికి జలాభిషేకం చేసినట్లు వివాహాన్ని జరిపించిన పండితుడు లఖన్ పరాశర్ తెలిపారు.





