
తిరుమల శ్రీవారి పరకామణిలో రూ.100 కోట్ల కుంభకోణం వార్తలు మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది. పరకామణిలో బంగారం చోరీ చేస్తుండగా ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి పట్టుబడ్డాడు. కాంట్రాక్ట్ ఉద్యోగి పెంచలయ్య 100 గ్రాముల బంగారు బిస్కెట్ను కాజేశాడు. గోల్డ్ బిస్కెట్ ను కాజేసి వ్యర్థాలను తరలించే ట్రాలీలో తరలిస్తుండగా పెంచలయ్యను TTD విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడ్ని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు. తిరుపతిలోని మారుతినగర్ కి చెందిన పెంచలయ్య యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
విజిలెన్స్ నిఘాలో శ్రీవారి పరకామణి: శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ ఘటనపై టీటీడీ అదనపు ఈవో స్పందించారు. హుండీని తరలించేటప్పుడు ఒప్పంద ఉద్యోగి దొంగలించాడని తెలిపారు. శ్రీవారి పరకామణి టీటీడీ విజిలెన్స్ నిఘాలో ఉంటుందని వెల్లడించారు. ఎప్పుడూ హుండీలను రెండుసార్లు తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. సీసీ కెమెరా ద్వారా నిందితుడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారని తెలిపారు.
రెండు హుండీలను ఎత్తుకెళ్లారు: మరోవైపు తిరుమల స్థానిక బాలాజీ నగర్లోని వినాయక ఆలయంలో హుండీ చోరీ జరిగింది. శనివారం అర్థరాత్రి ఎవరు లేని సమయంలో దొంగలు రెండు హుండీలను ఎత్తుకెళ్లారు. రెండు హుండీల్లో ఉన్న నగదు, కానుకలను చోరీ చేసిన దొంగలు వాటిని పక్కనే ఉన్న కమ్యూనిటీ హాల్ వద్ద వదిలేసి వెళ్లారు. హుండీలోని నగదును, కానుకలను వినాయక చవితికి ముందు ఆలయ పెద్దలు లెక్కింపు చేశారు. అనంతరం పెద్ద మొత్తంలో కానుకలు వచ్చినట్లు తెలుస్తోంది. చోరీ జరిగిన ఆలయంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలను పట్టుకునేందుకు పోలీసులకు ఇబ్బందిగా మారింది.




